వధువు సహా తల్లిదండ్రుల ఆత్మహత్య

26 Nov, 2017 19:02 IST|Sakshi

సాక్షి, చెన్నై: కుమార్తె పెళ్లి అర్థంతరంగా ఆగిపోవటంతో ఓ కుటుంబం తీవ్ర మనోవేదన చెందింది. వధువుతోపాటు ఆమె తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా అమ్మలూరు పిల్లయార్‌ కోవిల్‌ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గణేశన్, రాసాత్తి దంపతులకు రాజ్‌కుమార్, హరి హరసుధన్‌ కుమారులు, కుమార్తె గీత  (25) ఉన్నారు. రాజ్‌కుమార్‌ విదేశాలలో ఉద్యోగం చేస్తుండగా మానసిక రోగి అయిన హరిహరసుధన్‌ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇటీవల తిరువారూర్‌కు చెందిన ఓ యువకుడితో గీతకు వివాహ నిశ్చితార్థం జరిగింది. జనవరిలో వివాహం జరిపించేందుకు ముహూర్తం ఖరారు చేశారు.

ఈ పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం ఆ యువకుడి ఇంటి నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌ గణేశన్ కుటుంబాన్ని మనో వేదనకు గురి చేసింది. ఈ పెళ్లి తమకు ఇష్టం లేదని, రద్దు చేస్తున్నట్టు వరుడి కుటుంబం స్పష్టం చేయడంతో వధువు కుటంబసభ్యులు షాక్‌ తిన్నారు. ఈ నేపథ్యంలో గణేశన్‌ శనివారం రాత్రి భార్య, కుమార్తెలతో కలిసి సైనెడ్‌ మింగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి బయట నిద్రించే హరి హర సుధన్‌ ఎంతకు తల్లిదండ్రులు బయటకు రాక పోవడంతో ఆదివారం ఉదయం కేకలు పెట్టాడు. ఇరుగు పొరుగు వారు లోపలికి వెళ్లి చూడగా గణేశన్, రాసాత్తి, గీత విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన తిరువారూర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు