కాళ్లపారాణి ఆరక ముందే..

28 Apr, 2018 13:01 IST|Sakshi
నూతంకి సింధు మృతదేహం

అనుమానాస్పద స్థితిలో నవవధువు ఆత్మహత్య

ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి

వివాహం జరిగి 24 గంటలు గడవక ముందే పెళ్లింట విషాదం

చింతలపూడి : కాళ్ల పారాణి ఆరక ముందే నవవధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చింతలపూడి మండలం ఫాతిమాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. పెళ్లి జరిగి 24 గంటలు గడవకముందే నూతంకి సింధు (24) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 25న కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన జువ్వన రవికిరణ్‌తో ఫాతిమాపురం గ్రామానికి చెందిన నూతంకి సింధుకు నూజివీడులో వివాహం జరిగింది. మరుసటి రోజు 26న సింధు భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. సాయంత్రం 4 గంటల సమయంలో భర్త పక్క గదిలో ఉండగా సింధు గదిలో ఉన్న సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం సమాచారం అందుకున్న సీఐ పి.రాజేష్, ఎస్సై సీహెచ్‌ వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని విచారించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్‌ మురళీకృష్ణ ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

తహసీల్దార్‌ టి.మైఖేల్‌రాజ్‌ శవ పంచనామా నిర్వహించారు. సింధు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. మృతురాలి తల్లిదండ్రుల నుంచి కాని, అత్తింటి నుంచి కానీ ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిర్వహించాక సింధు మృతికి కారణాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. పెళ్లిలో నవ్వుతూ తుళ్లుతూ తిరిగిన సింధు హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన మనసులోని బాధను తమతో చెప్పినా అర్థం చేసుకుని తీర్చేవారమని ఇలా అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్తుందని అనుకోలేదని రోదిస్తున్నారు. సింధు మృతితో పెళ్లికి వచ్చిన  బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మరిన్ని వార్తలు