రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అమ్మాయిలు దుర్మరణం
పది రోజుల్లో అక్కపెళ్లి వుండగా ప్రమాదం
ఓడీ చెరువు: మరో పదిరోజుల్లో అక్కపెళ్లి జరుగనుంది. పెళ్లి పనుల్లో కలియతిరుగుతూ ఆనందంగా ఉన్న బాలికను విధి వంచించింది. పెళ్లి పనిలో అందరూ తలమునకలై ఉన్నారు. తన కూతురు పెళ్లి పత్రికలు పంచే పనిలో ఉన్న తల్లిదండ్రుల ఆనందం ఆవిరైంది. ఓడీ చెరువు మండలం డబురువారిపల్లి సమీపంలో కొండకమర్ల రహదారిపై ఓ ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయి ద్విచక్రవాహనం ఆదుపు తప్పడంతో గీత (14), ప్రమీల (19)లు మృతిచెందగా, రజిత్కు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పట్టపర్తి మండలం సాదార్లపల్లికి చెందిన ధారా వెంకటేశ్, రమణమ్మలకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె స్వాతికి ఈ నె ల 10న అమడుగూరు మండలం జేకే పల్లిలో వివాహం నిశ్చయమైంది. చిన్న కుమార్తె గీత అమడగూరులోని మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది.
పెళ్లి పనుల్లో భాగంగా గీత అమడగూరు మండలం మహమ్మదాబాద్కు చెందిన తన పెద్దమ్మ ఆదిలక్ష్మమ్మ, రమణప్పల కుమార్తె డిగ్రీ చదువుతున్న ప్రమీలను పెళ్లికి తీసుకెళ్లేందుకు వీరి బందువు కొండకమర్లకు చెందిన రజిత్తో కలసి బయలుదేరారు. మార్గ మధ్యలో డబురువారిపల్లి సమీపంలోని మలుపు వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టడంతో గీత తలకు తీవ్ర గాయలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయలైన ప్రమీలను చికిత్స నిమిత్తం కదిరికి తరలించారు. చికిత్స పొందుతూ ప్ర మీల మృతి చెందింది. డ్రైవింగ్ చేస్తున్న రజిత్కు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ రాజశేఖర్రెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.