సెల్ఫీ కోసం ప్రముఖ మోడల్‌ బలి

13 Jan, 2020 18:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్‌లోని లింకన్‌షైర్‌కు చెందిన ప్రముఖ వర్ధమాన మోడల్, 21 ఏళ్ల మోడలిన్‌ డేవిస్‌ తన మిత్రులతో కలిసి సెల్ఫీలకు ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియాలోని ‘డైమండ్‌ బే రిజర్వ్‌’ పర్వతాలపైకి వెళ్లారు. సూర్యోదయానికి కూడా అది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రాంతం. దాంతో వంద అడుగుల ఎత్తున్న పర్వత శిఖరం ఎక్కి ఆమె సెల్ఫీ తీసుకుంటుండగా, ప్రమాదవశాత్తు కాలు జారి పక్కనున్న సముద్రంలో పడిపోయి ప్రాణాలు విడిచారు. 

ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం పట్ల సోమవారం సోషల్‌ మీడియాలో నివాళులు వెల్లువెత్తుతున్నాయి. ఆమె మరణాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం ధ్రువీకరించడంతో రెండు దేశాల సోషల్‌ మీడియాలో ఆమె గురించే ఎక్కువ ప్రస్తావన ఉంది. ‘బ్యూటీఫుల్‌ ఇన్‌సైడ్‌ అండ్‌ అవుట్‌సైడ్‌’ అంటూ ఆమెను పలువురు వ్యాఖ్యానించి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు. 

ప్రపంచ పర్యటన పట్ల ఎంతో మక్కువ చూపించే డేవిస్‌ ఏడుగురు ‘బ్యాక్‌ప్యాకర్‌’ మిత్రులతో కలిసి ఆస్ట్రేలియా వచ్చారు. వారంతా వాక్లూజ్‌లో శనివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. అక్కడికి సమీపంలోని ‘డైమండ్‌ బే పర్వతం’ శిఖరాల మీదకు ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో చేరుకున్నారు. అప్పుడే ఉదయిస్తున్న లేత కిరణాల మసక వెళుతురులో శిఖరాగ్రం చివరన సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో పక్కనున్న సముద్రంలో పడిపోయారు. హెలికాప్టర్‌ ద్వారా ఆదివారం వెతికించగా ఆమె మృతదేహం దొరికింది. గత ఆగస్టు నెలలో కూడా ఓ 27 ఏళ్ల యువతి సెల్ఫీ తీసుకోబోయి ప్రమాదవశాత్తు మరణించారు.

మరిన్ని వార్తలు