కొడుకే హంతకుడా..?
భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన కూతురి వివాహం
ఏడేళ్లుగా విడిగానే ఉంటున్నారు
మూడురోజుల క్రితమే చంపినట్లు ఆనవాళ్లు
శవం దుర్వాసనతో విషయం బయటకు
వైఎస్ఆర్ జిల్లా, రాయచోటి టౌన్: రాయచోటి ఫ్రూట్స్ మండీల వీధిలో హషమ్ బేగ్ (55) అనే బ్రోకర్ హత్యకు గురియ్యాడు. ఆయన ఇక్కడి నుంచి ఇతరా రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాల నుంచి రాయచోటికి పలురకాల పండ్లు ట్రాన్స్ఫోర్టు చేయడానికి లారీలు, మినీ లారీలు, చిన్నట్రక్కులు బాడుగకు పంపించి వాటి ద్వారా వచ్చే బ్రోకరేజీ తీసుకోవడంతో పాటు సెకెండ్హ్యాండ్ వాహనాలను అమ్మించి వచ్చే డబ్బులతో జీవనం సాగించేవాడు. హషమ్బేగ్ మూడు రోజుల క్రితం ఇంట్లోనే హత్యకు గురియ్యాడు. ఎవరూ గుర్తించకపోవడంతో శవం దుర్వాసన బయటకు వచ్చింది. దీంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బుధవారం ఇంటి తలుపులు తెరిచి చూడగా మంచంపై మృతదేహం కనిపించింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
స్థానిక మండీల వీధిలోని ప్రధాన వీధిలో హషమ్ బేగ్ దాదాపుగా 30 ఏళ్ల నుంచి కాపురం ఉంటున్నాడు. ఆయనకు ముంబాయికి చెందిన రేహానాతో పాతిక సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కొడుకులు. కాపురం సజావుగా సాగుతున్న సమయంలో పెద్ద కుమార్తెకు వివాహ సంబంధాన్ని తన భార్య బంధువులు తరుపు నుంచి తేవడం వీరికి కాపురంలో కలహాలు తెచ్చిపెట్టింది. తన పెద్ద కుమార్తెను ముంబాయిలోని భార్య బంధువుల ద్వారా అక్కడికి చెందిన వ్యక్తికే ఇచ్చి వివాహం చేశారు. వివాహం ఇష్టం లేని తండ్రి ఆ విషయమై విభేదించాడు. అప్పటి నుంచి కుటుంబంలో కలతలు, కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆమె భర్తను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదంతా జరిగి సుమారు 7సంవత్సరాలైంది. అయితే పెద్దకుమారుడు మాత్రం అప్పుడప్పుడు వచ్చి తండ్రితో కలసి మాట్లాడివెళ్లేవాడని సమీప బంధువులు అంటున్నారు. ఈ నేపథ్యంలో 10 రోజుల క్రితం కుమారుడు సొహెబ్ తండ్రి దగ్గరకు వచ్చాడు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఇక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో హషమ్బేగ్ మిత్రులతో తన కొడుకుపై అనుమానం ఉందని ఎప్పుడైనా ఏదైనా చేస్తాడనే అనుమానాలు వ్యక్తం చేసేవారని స్థానికులు అనుకొంటున్నారు. ఈ క్రమంలో నాలుగు రోజుల నుంచి కుమారుడు కనిపించకుండా వెళ్లిపోయాడు. ఆ తరువాతనే తండ్రి మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇంటి బయట పడేసిన సిమ్ కార్డు ఎవరిది..?
ఇంటి బయల డ్రైనేజీలో ఐడియా సిమ్ కార్డు పడేశారు. హత్య జరిగిన రోజు పడేశారా..లేకా మరెవరైనా పడేశారా అనేది తెలియాల్సి ఉంది. అలాగే దగ్గరలో వాహనాలలోని ఇంజిన్కు ఉపయోగించే బెల్ట్ కూడా వంకర్లు తిరిగి పడి ఉంది.
మా ఇళ్లకువచ్చేవాడు కాదు: బంధువులు
భార్య వదిలేసి వెళ్లిన తరువాత ఆయన ఏ నాడు మా ఇళ్లకు వచ్చేవాడు కాదు. ఒక వేళ్లవచ్చినా టీ, కాఫీలు మాత్రమే తాగేవాడని.. కనీసం ఒకపూట కూడా భోజనం తినేవాడుకాదని సమీప బంధువులు అంటున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద కొడుకు వచ్చిన తరువాత ఇంటిలో గ్యాస్ కూడా తెచ్చుకొని వంట వండుకొని తినడం ఇద్దరు ( తండ్రీ కొడుకులు ) అనోన్యంగా ఉండటం చూశామని బంధువులు చెప్పడం మరో విశేషం.
హత్యేనని అనుమానం : పోలీసులు
జరిగిన సంఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు అర్బన్ ఎస్ఐ తాహీర్ హుస్సేన్ అన్నారు. ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇంటిలోకి వెళ్లి చూడగా మృతదేహంపై ఉన్న గాయాలు చేస్తే హత్య జరిగి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. దీని కోసం క్లూస్ టీంను కూడా పిలిచాం. ఘటనపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.