కూల్‌డ్రింక్‌లో విషం కలిపి.. బ్లేడ్‌తో గొంతు కోసి..

13 Oct, 2019 13:35 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: అన్న కూతురు ప్రేమ పెళ్లి నచ్చని ఓ వ్యక్తి ఉన్మాదిగా మారి ముగ్గురిని హతమార్చిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని భిక్కనూరు మండలం జంగంపల్లి శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ముగ్గురి ఉసురు తీసిన ఉన్మాది బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. అతని మృతదేహం దోమకొండలోని గుండ్ల చెరువులో ఆదివారం లభ్యమైంది. 

వివరాలు.. భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన బందెల బాలయ్య (45), బందెల రవి అన్నదమ్ములు. బాలయ్యకు భార్య, ఇద్దరు కూతుళ్లు దీప, లత(16), కుమారుడు అజయ్‌ ఉన్నారు. రవికి భార్య, ఒక కూతురు చందన(8) ఉన్నా రు. బాలయ్య పెద్ద కూతురు దీప నెల రోజుల క్రితం జంగంపల్లి గ్రామానికి చెందిన వారి కులానికే చెందిన నర్సింలు అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయంలో ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగినా.. ఒకే కులం కావడంతో సర్దుకుపోయారు. దీంతో కుటుంబం పరువు తీసిన అన్నను, అతని కుటుంబ సభ్యులను చంపుతానంటూ రవి పలుమార్లు హెచ్చరించాడు. సరైన సమయం కోసం ఎదురు చూశాడు.

శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మాయ మాటలు చెప్పి, నమ్మించి తన బైకుపై అన్న బాలయ్య, అన్న రెండో కూతురు లత (16), తన కూతురు చందన (8) లను తీసుకుని దోమకొండ మండల కేంద్రానికి సమీపంలోని మల్లన్న ఆలయం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ను గ్లాసుల్లో పోసి ముగ్గురితో తాగించాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో అన్న బాలయ్య, అన్న కూతురు లత, తన సొంత కూతురు చందన గొంతు కోసి ప్రాణాలు తీశాడు. ముగ్గురూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. గుండ్ల చెరువు వద్ద తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చదవండి: అన్న కూతురు ప్రేమ నచ్చని ఉన్మాది

మరిన్ని వార్తలు