తమ్ముళ్లే కడతేర్చారు!

22 Apr, 2019 07:08 IST|Sakshi
అంజయ్య మృతదేహం

కుటుంబ కలహాలతో అన్న దారుణ హత్య 

చెల్లెలు ఫిర్యాదుతో కేసు నమోదు 

గోకుల్‌నగర్‌లో వెలుగుచూసిన దారుణం

మద్దూరు (కొడంగల్‌): ఒకే రక్తం పంచుకుని పుట్టిన తమ్ముల్లే.. చిన్నపాటి తగాదాలతో సొంత అన్నను బండరాయితో మోది హతమార్చారు. ఈ ఘటన మండలంలోని గోకుల్‌నగర్‌లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొత్త అంజయ్య(29) తండ్రి గోవిందు కొంతకాలం క్రితం మృతి చెందడంతో హైదరాబాద్‌లో కూలీ పనిచేసుకుంటూ తన ఇద్దరు తమ్ముళ్లు (కొత్త రాజు, కొత్త రమేష్‌)తోపాటు తల్లి తిరుమలమ్మ, భర్త వదిలేసిన అక్క అంజమ్మను పోషిస్తున్నాడు. పెద్ద తమ్ముడు కొత్త రాజు కూడా హైదరాబాద్‌లో కూలీ పనిచేస్తుండేవాడు.

గ్రామంలో తల్లి తిరుమలమ్మ, అక్క అంజమ్మ, చిన్న తమ్ముడు రమేష్‌ ఉండేవారు. మరో చెల్లెలు అనితను గ్రామంలోనే ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు.  అయితే తిమ్మారెడ్డిపల్లిలో బావాజీ జాతర జరుగుతుండడంతో గత నాలుగు రోజుల క్రితం కొత్త అంజయ్య గ్రామానికి వచ్చాడు. అలాగే ఒక తర్వాత తమ్ముడు కొత్త రాజు సైతం గ్రామానికి వచ్చాడు. కొంతకాలం క్రితం నిర్మించిన ఇంటిపై ఉన్న అప్పు విషయమై శనివారం రాత్రి కొత్త అంజయ్య కుటుంబ సభ్యులకు చెబుతూ పనిచేయాలని ఇద్దరు తమ్ముళ్లు, చెల్లెలు, తల్లికి చెప్పాడు. ఇదే క్రమంలో మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది.

దీంతో ఇద్దరు తమ్ముళ్లు రాజు, రామేష్‌లు బండరాయి తీసుకువచ్చి కొత్త అంజయ్య నెత్తిపై వేశారు. దీంతో అంజయ్య తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం గ్రామస్తులకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరో చెల్లెలు బసుల అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  

మరిన్ని వార్తలు