వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..

23 May, 2020 13:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బావమరిదిని చంపిన బావ

నిమ్మారెడ్డిపాలెం హత్య కేసును ఛేదించిన పోలీసులు

ప్రకాశం, దర్శి: సొంత అక్కతో స్వయానా ఆమె తమ్ముడే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఆమె భర్త బావమరిదిని అతికిరాతకంగా హత్య చేశాడని డీఎస్పీ కె. ప్రకాశరావు వెల్లడించారు. నిమ్మారెడ్డిపాలెంలో 12వ తేదీ అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో పోకూరి రామస్వామి (55)ని అతి కిరాతకంగా ముఖంపై కొట్టి చంపిన కేసును దర్శి పోలీసులు ఛేదించారు. స్థానిక తన కార్యాలయంలో డీఎస్పీ ప్రకాశరావు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హంతకుడి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోకూరి రామస్వామి సొంత అక్కను దామా సుబ్బారావు అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. బావ మరిది రామస్వామి ఏడాదిన్నర క్రితం కొత్తగా ఇంటి నిర్మాణం సమయంలో భూమి పూజకు చుట్టాలు వచ్చారు.

ఇంట్లో మంచాలు చాలక పోవడంతో అంతా సుబ్బారావు ఇంట్లోకి వెళ్లి పడుకున్నారు. ఆ సమయంలో సొంత అక్క పక్కన ఆమె సోదరుడు రామస్వామి పడుకుని ఉండటాన్ని భర్త సుబ్బారావు గమనించి అనుమానించాడు. తన భార్యకు ఆమె తమ్ముడితో వివాహేతర సంబంధం ఉందని సుబ్బారావు అనుమానం పెంచుకున్నాడు. ఆ రోజు నుంచి బావమరిదిపై అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 12వ తేదీ రాత్రి తన గొర్రెల దొడ్డి వద్ద రామస్వామి ఒంటరిగా పడుకుని ఉండటాన్ని గమనించిన సుబ్బారావు రోకలి బండతో ముఖంపై తీవ్రంగా కొట్టి గాయపరిచి హత్య చేశాడు. ఆ రోజు నుంచి పరారీలో ఉన్నాడు. శుక్రవారం గ్రామ వీఆర్వో బండారు శ్రీనివాసరావు వద్ద లొంగి పోయాడు. వీఆర్వో నిందితుడిని సీఐ మహమద్‌ మొయిన్‌ వద్ద హాజరు పరిచారు. సుబ్బారావును అరెస్టు చేసి హత్య చేసేందుకు ఉపయోగించిన రోకలి బండను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం దర్శి జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్డ్‌లో నిందితుడిని హాజరు పరచనున్నట్లు డీఎస్పీ ప్రకాశరావు వివరించారు. డీఎస్పీతో పాటు ఎస్‌ఐ ఆంజనేయులు ఉన్నారు.

మరిన్ని వార్తలు