అక్క భర్తే యముడయ్యాడు..

16 Oct, 2018 08:27 IST|Sakshi
అనూష (ఫైల్‌), అనూష మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

సాక్షి, కొణిజర్ల (ఖమ్మం): సొంత అక్క భర్తనే ఆమె పాలిట య ముడయ్యాడు. ప్రేమించాలని బావ నిత్యం వేధించి..మానసికంగా నరకం చూయించి..చివరకు కేసు పెడతానని బెదిరించి.. ఆమె ప్రాణం తీసుకునేలా ప్రవర్తించాడు. ఎస్సై చిలువేరు యల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కొణిజర్ల మండలం చిన్నగోపతి గ్రామానికి చెందిన లింగాల భిక్షమయ్యకు ఇద్దరు కూతుళ్లు. పెద్దకూతురు సుష్మకు అదే మండలం సింగరాయపాలెంకు చెందిన మో టపోతుల అశోక్‌తో వివాహం జరిపారు. ఇతను కొత్తగూడెం క్రైంబ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గతేడాదికాలంగా అశోక్‌  తనను ప్రేమించాలని మరదలు లింగాల అనూష (21)ను వేధిస్తున్నాడు. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో గతంలో పెద్దమనుషులతో చెప్పించారు.

అయినా కూడా ఆమెను వదిలిపెట్టలేదు. ఆదివారం ఉదయం చిన్నగోపతి వచ్చిన అశోక్‌ అనూషకు ఇవ్వమని ఓ నోటీస్‌ను పక్కింటి అమ్మాయితో పంపించాడు. అందులో ఓ వ్యక్తి అనూషకు వ్యతిరేకంగా కేసు పెట్టినట్లు, కోర్టుకు హాజరుకాక పోతే అరెస్టు చేస్తారని ఉంది. దీంతో భయపడిన ఆ యువతి విషయాన్ని తల్లికి చెప్పి తండ్రిని పిలుచుకురమ్మని బయటికి పంపింది. ఆ తర్వాత..ఇంట్లో ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తల్లీతండ్రి కూతురిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ..అప్పటికే ప్రాణాలొదిలింది. తన అల్లుడు వేధింపుల కారణంగానే చిన్నకూతురు ఆత్మహత్య చేసుకుందని భిక్షమ య్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు