డబ్బుల వివాదమే కారణం..

23 Mar, 2019 11:39 IST|Sakshi
నరేందర్‌ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు(ఫైల్‌)

బావ హత్య కేసులో బావమరిది అరెస్ట్‌

కుత్బుల్లాపూర్‌: భార్యాభర్తల మధ్య డబ్బుల విషయంలో జరిగిన గొడవ చివరకు హత్యకు దారి తీసింది. ఈ విషయంలో జోక్యం చేసుకున్న బావమరిది బావను  హత్య చేసిన సంఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాలానగర్‌ డీసీపీ పద్మజారెడ్డి శుక్రవారం వివరాలు వెల్లడించారు. మేడ్చల్‌ మండలం రాయిల్‌పూర్‌ ప్రాంతంలో ఉంటున్న పడిగిపల్లి నరేందర్‌ (36), రమాదేవి దంపతులకు ఇద్దరు సంతానం. అల్వాల్‌ ప్రాంతంలోని సొంత ఇల్లు అమ్మగా వచ్చిన నగదు నరేందర్‌ వద్ద ఉంది. ఈ విషయంలో తరచూ భార్యాభర్తల మధ్య  గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి భోజనం చేస్తుండగా మరోమారు గొడవ జరిగింది.

దీంతో ఆగ్రహానికి లోనైన రమాదేవి తన తమ్ముడు చింతల హరినా«థ్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించింది. వెంటనే సోదరి ఇంటికి వచ్చిన హరినాథ్‌  బావ నరేందర్‌పై ఖాళీ బీరు బాటిల్‌తో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా మెడకు టవల్, తాడుతో భిగించడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే హత్య చేసిన విషయాన్ని గోప్యంగా ఉంచిన రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు మృతుని ఒంటిపై గాయాలను గుర్తించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు వెల్లడించింది. రమాదేవి, హరినాథ్‌లను అరెస్ట్‌ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు