నువ్వులేని లోకంలో నేనుండలేను

25 Dec, 2019 08:33 IST|Sakshi
మృతి చెందిన అన్నదమ్ములు (ఫైల్‌)

తమ్ముడి ఆత్మహత్యనుజీర్జించుకోక..

మనస్తాపంతో అదేచోట ఉరివేసుకున్న అన్న

వరుస ఘటనలతో శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

కాశిమేడులో విషాదం

తమిళనాడు, తిరువొత్తియూరు: తల్లిదండ్రులు మందలించారని తమ్ముడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ్ముడు మృతి తట్టుకోలేక అదే చోట అన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చెన్నై కాశిమేడులో సంచలనం కలిగించింది. చెన్నై కాశిమేడు కాశితోట 2వ వీధికి చెందిన అలెగ్జాండర్‌ (48)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు హృదయరాజ్‌ (24) బీటెక్‌ చదువుతున్నాడు. చిన్న కుమారుడు ఆరోగ్య ఆకాష్‌ (23) బీఈ పూర్తి చేశాడు. రెండో అంతస్తులోని ఓ గదిలో హృదరాజ్, 3వ అంతస్తులోని గదిలో ఆరోగ్య ఆకాష్‌ ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆరోగ్య ఆకాష్‌ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు తన స్నేహితుడికి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ పంపించాడు. వెంటనే స్నేహితుడు హృదయరాజ్‌తో కలిసి ఆరోగ్య ఆకాష్‌ గదికి వెళ్లారు. అప్పటికే ఆరోగ్య ఆకాష్‌ ఉరి వేసుకుని వేలాడుతున్నాడు. దిగ్భ్రాంతి చెందిన ఇద్దరూ ఆరోగ్య ఆకాష్‌ను క్రిందకు దించి చికిత్స కోసం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్టు తెలిపారు. కాశిమేడు పోలీసులు ఆరోగ్య ఆకాష్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలో హృదయరాజ్‌ కనిపించలేదు. దీంతో అతని తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటిలోని మూడో అంతస్తులో ఆరోగ్య ఆకాష్‌ ఉంటున్న గదిలోకి వెళ్లి చూశారు. ఆరోగ్య ఆకాష్‌ ఉరి వేసుకుని మృతి చెందిన చోటే హృదయరాజ్‌ ఉరి వేసుకుని శవంగా వేలాడుతున్నాడు. ఇది చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆరోగ్య ఆకాష్‌ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడని తెలిసింది. మత్తు పదార్థాలకు అలవాటు పడిన అతను సరిగా పనికి వెళ్లకపోవడం వల్ల తల్లిదండ్రులు అతన్ని మందలించారు. దీంతో విరక్తి చెందిన అతను ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. తమ్ముడి మృతిని తట్టుకోలేక అదే చోట అన్న ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఇద్దరు కుమారులు ఒకేరోజు మృతిచెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు.

మరిన్ని వార్తలు