ఇస్లామాబాద్ : ఆస్తిలో వాటా ఆడిగిందన్న అక్కసుతో సోదరి రెండు కాళ్లను సోదరులు నరికేసిన కిరాతక ఘటన పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో చోటుచేసుకుంది. ఖానెవాల్ ప్రాంతానికి చెందిన వ్యవసాయ పనులు చేసుకునే ఓ మహిళ వారసత్వంగా వస్తున్న ఆస్తిలో తన సోదరులతో సమానంగా వాటా కోరింది. వాళ్లు దానికి అంగీకరించకపోవడంతో కోర్టుకి వెళ్తానని బెదిరించింది. కోపంతో ఊగిపోయిన సోదరులు విచక్షణ కోల్పోయి సోదరిపై దారుణంగా దాడికి తెగబడ్డారు. గొడ్డలితో దాడి చేసి కాళ్లను నరికేశారు.
తీవ్రంగా గాయపడి చావుబతుకుల్లో ఉన్న ఆమెను అధికారులు ఖానెవాల్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. గొడ్డలి దాడితో కాలి ఎముకలు బాధితురాలి శరీరం నుంచి వేరయ్యాయని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను ముల్తాన్లోని నిష్తార్ ఆస్పత్రికి తరలించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలి వాంగ్మూలం తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.