విద్యుదాఘాతంతో అన్నదమ్ముల మృతి

1 Jul, 2020 04:20 IST|Sakshi
రమేష్, మల్లేష్‌ మృతదేహాలతో రోడ్డుపై ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు

రాత్రి భారీ వర్షానికి కంచెపై తెగిపడిన సర్వీస్‌ వైరు

ఉదయం కంచెను తాకడంతో విద్యుదాఘాతానికి గురైన అన్న..

అన్నను కాపాడే ప్రయత్నంలో తమ్ముడూ మృతి

ఉరవకొండ: రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషించుకునే అన్నదమ్ములు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..  

► స్థానిక బాలాజీ థియేటర్‌ ఎదురుగా ఎస్సీ కాలనీలో నివసిస్తున్న అన్నదమ్ములు రమేష్‌ (55), మల్లేష్‌ (52) రిక్షా తొక్కుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. 
► సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రమేష్‌ ఇంటికి సంబంధించిన విద్యుత్‌ సర్వీసు వైరు తెగిపోయి పక్కనే ఉన్న నీళ్ల ట్యాంకు కంచెపై పడింది. 
► ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన రమేష్‌ ట్యాంకు వద్ద ఉన్న కంచెను ముట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌ కొట్టి అక్కడికక్కడే కుప్పకూలాడు. 
► అన్న కింద పడటం గమనించిన తమ్ముడు మల్లేష్‌ పరుగెత్తుకుని వెళ్లి కాపాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో మల్లేష్‌ కూడా విద్యుదాఘాతానికి గురై కుప్పకూలాడు.  
► కొద్ది సేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 
► విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట మృతదేహాలతో నిరసనకు దిగారు.  
► అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామని ఎస్‌ఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 
► పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. 
► రమేష్‌కు భార్య రాధమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మల్లేష్‌కు భార్య తిప్పమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. 

మరిన్ని వార్తలు