అన్నదమ్ముల దుర్మరణం

17 Jan, 2019 07:09 IST|Sakshi
కొపాల తమ్మిరెడ్డి, కొపాల తమ్మిరెడ్డి మృతదేహలు

అశ్వారావుపేటరూరల్‌: కారు ఢీకొన్న ప్రమాదంలో సోదరులైన ఇద్దరు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అశ్వారావుపేట మండలం కన్నాయిగూడెం–కొత్త కన్నాయిగూడెం గ్రామాల మధ్యలోగల చప్టా వద్ద బుధవారం సాయంత్రం ఇది జరిగింది. మండలంలోని గోగులపుడి గ్రామానికి చెందిన అన్నదమ్ములు కొపాల తమ్మిరెడ్డి(52), కొపాల సత్తిరెడ్డి(34), పండారెడ్డి కలిసి ద్విచక్ర వాహనంపై అశ్వారావుపేట వైపు నుంచి స్వగ్రామమైన గోగులపుడికి వెళ్తున్నారు. కన్నాయిగూడెం వైపు నుంచి ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన కారు వీరి వాహనాన్ని ఢీకొంది. తమ్మిరెడ్డి, సత్తిరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. పండారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ కారు ఆగకుండా వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత స్థానికులు ప్రమాదాన్ని గమనించారు. తీవ్రంగా గాయపడ్డ పండారెడ్డిని అశ్వారావుపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రమాద స్థలాన్ని ఎస్‌ఐ వేల్పుల వెంకటేశ్వరరావు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పండగ రోజు విషాదం.. 
సంక్రాంతి పండగ రోజున జరిగిన ఈ ప్రమాదంతో.. ఆ ముగ్గురి ఇళ్లల్లో విషాదం నెలకొంది. పండగ రోజున పిండి వంటలకని కిరాణా సరుకులు తెచ్చేందుకని వీరు ముగ్గురూ ద్విచక్ర వాహనంపై అశ్వారావుపేట సంతకు వచ్చారు. బెల్లం, కిరాణ సరుకులు తీసుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులిద్దరూ అన్నదమ్ములు. కొపాల తమ్మిరెడ్డి... ఆదివాసీ కొండరెడ్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు. ఆయన భార్య కొన్నేళ్ల క్రితమే మృతిచెందింది. ఇతనికి ఇద్దరు కుమారులున్నారు. సత్తిరెడ్డికి భార్య, నాలుగేళ్ల చిన్నారి మధుప్రియ ఉన్నారు. వీరి కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ముగ్గురి స్వగ్రామమైన గోగులపుడిలో విషాదం నెలకొంది.

మరిన్ని వార్తలు