మృత్యువులోనూ వీడని బంధం

1 Mar, 2019 08:29 IST|Sakshi
ఉదయ్, మన్మథ (ఫైల్‌) 

గుర్తు తెలియని వాహనం ఢీకొని అన్నదమ్ముల దుర్మరణం

చివ్వెంల (సూర్యాపేట) : మృత్యువులోను వారి బంధం వీడలేదు. వరుసకు సోదరులైనప్పటికీ స్నేహితులలాగే కలిసి మెలిసి తిరుగు తూ ఉండేవారు. వారిని  బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు మింగేసింది. మండల పరిధిలోని కుడకుడ గ్రా మానికి చెందిన చీమకండ్ల కాశయ్య, దీవెనమ్మ పెద్ద కుమారుడు చీమకండ్ల ఉదయ్‌ (22) వృత్తిరీత్యా జనగాం క్రాస్‌రోడ్డులో ఓ హో టల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. అదే  గ్రామానికి చెందిన చీమకండ్ల ఎల్లయ్య, జయమ్మల మూడవ కుమారుడు మన్మథ (24) వృత్తిరీత్యా సెంట్రింగ్‌ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం ఆత్మకూర్‌. ఎస్‌ మండలం పాతర్లపహాడ్‌ గ్రామానికి సొంత పనుల నిమిత్తం బైక్‌పై వెళ్లి తిరిగి అర్ధరాత్రి ఇంటికి వస్తుండగా మా ర్గమధ్యలో సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై కుడకుడ గ్రామ శివారులో జీఎంఆర్‌ టౌన్‌షిప్‌ వద్ద వరంగల్‌ నుంచి సూర్యాపేట వైపు వస్తున్న గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టి వెళ్లిపోయింది.

ఈ ప్రమాదంలో మన్మథ, ఉదయ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను అరగంట సేపు వరకు ఎవరూ చూడలేదు. అనంతరం మండల పరిధిలోని గాయంవారిగూడెం గ్రామం వైపు వెళ్తున్న కొందరు వ్యక్తులు చూసి చివ్వెంల పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సీహెచ్‌.నరేష్‌ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. వారి వద్ద ఉన్న కొన్ని గుర్తింపు కార్డుల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మన్మథ గత పదిహేను రోజుల క్రితం బైక్‌ను కొనుగోలు చేశారు. మృతులు ఇద్దరూ అవివాహితులు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది.

మరిన్ని వార్తలు