ప్రాణం తీసిన సిగరెట్‌ గొడవ

15 Jun, 2018 11:19 IST|Sakshi
హత్యకు గురైన అన్నదమ్ములు అమీన్,మతిన్‌ (ఫైల్‌)

అన్నదమ్ముల హత్య

కేజీ హళ్లిలో ఉద్రిక్తత

బనశంకరి: సిగరెట్‌ కోసం గొడపడిన ఘటనలో అన్నదమ్ములు హత్యకు గురైన  ఉదంతం కేజీ.హళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... గోవిందపుర మెయిన్‌రోడ్డు వీరణ్ణగడ్డ నివాసి అమీన్‌ (32) టెంపో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి గోవిందపుర మెయిన్‌రోడ్డులోని మాలిక్‌ అలీ దుకాణంలో అమీన్‌ సిగరెట్‌ తీసుకుని డబ్బు ఇవ్వకుండా వెనుతిరిగాడు. ఈ సమయంలో దుకాణం యజమాని మాలిక్‌ అలీ సిగరెట్‌ డబ్బు ఇవ్వాలని అడగటంతో కోపోద్రిక్తుడైన అమీన్, మాలిక్‌అలీని ఇష్టానుసారం చితకబాదాడు. తక్షణం మాలిక్‌అలీ కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో బంధువులు కర్రలు, మరణాయుధాలతో ఘటనాస్ధలానికి చేరుకుని అమీన్‌పై ప్రతిదాడికి పాల్పడ్డారు.

విషయం తెలుసుకున్న అమీన్‌ సోదరుడు మతీన్‌ (30) ఘటనాస్ధలానికి చేరుకుని గొడవపడుతున్న వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేయగా ఇతడిపై కూడా మాలిక్‌ అలీ బంధువులు ఇష్టానుసారం దాడికి పాల్పడి ఉడాయించారు. గాయపడిన అమీన్, మతీన్‌లను అంబేడ్కర్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి పొద్దుపోయిన మతిన్‌ మృతిచెందాడు. నిమ్హాన్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమీన్‌ కూడా మృతిచెందాడు. మృతుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసుల ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.  కేజీ హళ్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు