ఫేస్‌బుక్‌ తంటా..యువకుడిపై పాశవిక దాడి!

17 Oct, 2018 08:37 IST|Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం: పాతకక్ష్యలను మనసులో పెట్టుకుని కొందరు ఇద్దరు యువకులపై పాశవిక దాడికి పూనుకున్నారు. ఈ సంఘటన పట్టణంలో హల్‌చల్‌ సృష్టించింది. రూరల్‌ ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పీర్లబాయికి చెందిన శ్యాంసుందర్‌ అతని స్నేహితుడు రోహిత్‌ మంగళవారం లైసెన్స్‌ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మర్లుకు చెందిన చాణక్య అతని స్నేహితులు జగదీష్, పల్లె నరేష్, పల్లె దేవ, కృతిక్‌తోపాటు మరికొందరు కలిసి శ్యాంసుదర్, రోహిత్‌ను పట్టుకుని వారి కాలనీకి తీసుకుకెళ్లారు. దుస్తులు తొలగించి నగ్నంగా చేసి చేతులతో, కర్రలతో దాడిచేశారు. అంతటితో ఆగకుండా వీడియో చిత్రీకరించారు.
  
బయటికి వచ్చిందిలా..
 
ఆగస్టు 25న చాణిక్య, వేపూర్‌గేరికి చెందిన బంటి ఫొటోలను గుర్తుతెలియని వ్యక్తులు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశారు. అయితే అందులో చాణక్య ఫొటోను ఎక్కువ మంది లైక్‌ కొట్టడంతో పాటు కామెంట్‌లు చేశారు. నాకంటే ఎక్కువ లైక్‌లు అతనికి వచ్చాయని బంటి తట్టుకోలేక చాణక్యను కొట్టాలని పతకం రచించాడు. అందులో భాగంగానే చాణక్య స్నేహితుడు  శ్రీకాంత్‌చారిని వెంట పెట్టుకొని బంటి అతని స్నేహితులు దత్తు, శ్యామ్‌సుందర్, జగదీష్, శివ, సందీప్, శివసాయి, రోహిత్, విష్ణు, మధుచారి, నందివర్ధన్‌రెడ్డిలతో కలిసి ఆగస్టు 25న రాత్రి 9.30గంటలకు చాణక్య ఇంటికి వెళ్లారు.

శ్రీకాంత్‌ చారితో అతనిని బయటకు తీసుకువచ్చే విధంగా ప్లాన్‌ చేసి  కొంత దూరం మాటల్లో పెట్టి తీసుకెళ్లారు. బంటికి సారీ చెప్పాలని అతని స్నేహితులు చాణక్యతో గొడవ పడ్డారు. వినకపోవడంతో ఇనుప రాడ్లు, కట్టెలతో చాణక్యపై దాడి చేశారు. బట్టలు తీసి నగ్నంగా చేసి కొట్టడంతో రక్తగాయాలయ్యాయి. ఈ విషయం బయటికి పొక్కలేదు. ప్రతికారం తీర్చుకోవాలని చాణక్య అదేపద్ధతిలో చాణక్య అతని స్నేహితులు కలిసి శ్యాంసుందర్, రోహిత్‌పై దాడి చేశారు. శ్యాంసుందర్‌ తల్లి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు