పరీక్ష రాయనివ్వలేదని బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

17 Nov, 2017 03:36 IST|Sakshi

మేడ్చల్‌ జిల్లాలో బీటెక్‌ విద్యార్థి అభిషేక్‌ ఆత్మహత్య

ఘట్‌కేసర్‌/కీసర: కళాశాల యాజమాన్యం వేధింపులతో ఓ కాలేజీ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్‌ జిల్లా కీసర మండలం నాగారంలోని ఎస్‌వీ నగర్‌లో నివాసం ఉండే రావి నాగేందర్‌రెడ్డి కుమారుడైన అభిషేక్‌ రెడ్డి(20) ఘట్‌కేసర్‌ మండలంలోని అవుశాపూర్‌ విజ్ఞాన్‌భారతి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. 50 శాతం మాత్రమే హాజరు ఉండటంతో అతన్ని కళాశాల యాజమాన్యం పరీక్షలు రాయడానికి అనుమతించలేదు. దీంతో మనస్తాపం చెందిన అభిషేక్‌ రోజూలాగానే బుధవారం కాలేజీకి బయలుదేరాడు.

కానీ సాయంత్రమైనా ఇంటికి రాలేదు. కాగా, గురువారం నగరంలోని ఆళ్లగడ్డ వద్ద రైలు ట్రాక్‌పై గుర్తు తెలియని శవం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలంలో మృతుని వద్ద లభించిన ఆధారాలతో అభిషేక్‌గా పోలీసులు గుర్తించారు. శవాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కళాశాల యాజమాన్యం హాజరు విషయంలో చేసిన వేధింపుల కారణంతోనే అభిషేక్‌ ఆత్యహత్య చేసుకున్నాడని మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతుని కుటుంబ సభ్యులది యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని గ్రామం. పిల్లల చదువు నిమిత్తం నగరానికి వచ్చారు.

మరిన్ని వార్తలు