పోలీసుల అప్రమత్తతతో తప్పిన పెను విధ్వంసం
పర్ణశాల: మావోయిస్టులు పేలుడు పదార్థంతో విధ్వం సం సృష్టించేందుకు ఏర్పాటు చేసిన బకెట్ బాంబును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీసులు నిర్వీర్యం చేశారు. పోలీసులు, ప్రజాప్రతినిధులు లక్ష్యంగా మండలంలోని చెరుపల్లి, మారాయిగూడెం మధ్యలో ఓ కల్వర్టు కింద బకెట్లో పేలుడు పదార్థం, ఇనుప రేకు ముక్కలతో బాంబును ఏర్పాటు చేశారని ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు.
నిఘా వర్గాల సమాచారం మేరకు ఎస్పీ అంబర్ కిశోర్ఝా ఆదేశాలతో సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ బలగాలతో ఘటనా స్థలానికి చేరుకొని బాంబును నిర్వీర్యం చేశామన్నారు. అక్కడి నుంచి ఒక బకెట్, ఇనుప రేకు ముక్కలు, 30 మీటర్ల వైరును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.