పట్నా : విద్యాబుద్ధులు చెప్తానని సుద్దులు పలికిన ఓ బౌద్ధ సన్యాసి తన స్కూల్లో చదువుతున్న విద్యార్థులపట్ల అసభ్యంగా ప్తవర్తించాడు. వారిపై లైంగిక దాడికి దిగడంతోపాటు గొడ్డును బాదినట్టు బాదాడు. ఈ ఘటన బౌద్ధగయలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. ‘ప్రజ్ఞా జ్యోతి బుద్ధిస్ట్ అండ్ మెడిటేషన్ సెంటర్’ పేరుతో బౌద్ధగయలోని మస్తీపూర్లో ఓ బౌద్ద సన్యాసి పాఠశాల నిర్వహిస్తున్నాడు. అస్సాం రాష్ట్రానికి చెందిన 15 మంది బాలురు అక్కడ విద్యనభ్యసిస్తున్నారు.
స్కూల్లో టీచర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 15 మంది విద్యార్థులు ఆరోపించారు. తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించారు. కాగా, నిందితున్ని కస్టడీలోకి తీసుకున్నామని గయ ఎస్పీ రాజ్కుమార్ షా వెల్లడించారు. బిహార్లో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వంపై ఓవైపు ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండగా.. ఈ ఘటన జరగడం విశేషం. బిహర్లోని ముజఫర్పూర్లో షెల్టర్ హోం నిర్వహణ పేరుతో బాలికలపై లైంగిక దాడులు జరిగిన విషయం కొన్ని నెలల కిందట బయటపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 24 మంది బాలికలు లైంగిక దాడికి గురైనట్టు వెల్లడైంది.