ఆ వార్తను పదే పదే చూసి...

7 Jul, 2018 12:30 IST|Sakshi

న్యూస్‌ ఛానెళ్లలో ప్రసారం అవుతున్న ఒకే వార్తను పదే పదే చూసిన ఓ వ్యక్తి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికే డిప్రెషన్‌లోకి వెళ్లిపోగా.. ఆ కథనాలు అతనిపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఆ పెద్దాయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ ఆత్మహత్య ఘటనల ఉదంతం కేసులో దర్యాప్తు కొనసాగుతున్న విషయం విదితమే. ఇదిలా ఉంటే గోరెగావ్‌కు చెందిన 63 ఏళ్ల కృష్ణశెట్టి అనే వ్యక్తి మూడేళ్ల క్రితం వ్యాపారంలో భారీగా నష్టాలు రావటంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఇంటికే పరిమితమైన ఆయన.. బురారీ ఫ్యామిలీ సూసైడ్‌ కథనాలను టీవీలో రెప్పవేయకుండా చూస్తూ వస్తున్నాడు. వద్దని భార్య, కూతురు ఎంత వారించినా కృష్ణ పట్టించుకోలేదు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనై శుక్రవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘ఆ కుటుంబం(భాటియా ఫ్యామిలీ) చేసింది నిజంగానే సాహసం. చావటానికి చాలా ధైర్యం కావాలి’ అని తరచూ తమతో చెప్పేవాడని కృష్ణ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన శుభంగి పారేకర్‌ అనే మానసిక వైద్యుడు ఇలాంటి కథనాల విషయంలో సున్నితత్వం పాటించాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు