నల్గొండలో బస్సు ప్రమాదం

15 Feb, 2019 07:17 IST|Sakshi

సాక్షి, నల్గొండ : జిల్లాలోని వేములపల్లి మండలం బుగ్గబావి వద్ద  శుక్రవారం తెల్లవారు జామున  రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 22 మందికి స్పల్ప గాయాలు కాగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37 మంది ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

ప్రకాశం జిల్లా కందుకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి ప్రయాణికులతో హైదరాబాద్‌ బయల్దేరింది. శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో బుగ్గబావిగూడెం సమీపంలోకి రాగానే వేగంతో వెళ్తున్న కంటైనర్‌ను తప్పించే క్రమంలో బోల్తాపడి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అంతా బురదమయంగా ఉండటంతో పలువురు ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలైన వారిని చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించారు.

మరిన్ని వార్తలు