బైక్‌ను ఢీకొన్న బస్సు

10 Apr, 2018 10:39 IST|Sakshi
గాయపడ్డ రామారావు

యువకుడికి తీవ్రగాయాలు

రణస్థలం : మండల కేంద్రంలో సూర్య స్కూల్‌ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ప్రమాదం జరిగింది. విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...

లావేరు మండలంలోని ఇజ్జాడపాలెం గ్రామానికి చెందిన గొర్లె రామారావు(25) విశాఖపట్నం వైపు నుంచి ద్విచక్రవాహనంపై లావేరు వైపు వస్తున్నాడు. రణస్థలం మండల కేంద్రంలో సూర్య స్కూల్‌ వద్దకు వచ్చేసరికి వేగ నియంత్రణ బోర్డులు తప్పిస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఇతడిని ఢీకొట్టింది.

బైక్‌ పడిపోవడంతో రామారావు తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానిక పోలీసులు వచ్చి బాధితుడిని అంబులెన్స్‌లో ఎక్కించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. క్షతగాత్రుడి చెవి, ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం, వాంతులు కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై జె.ఆర్‌.పురం ఎస్సై వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  

మరిన్ని వార్తలు