ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది దుర్మరణం

28 Jan, 2020 20:07 IST|Sakshi

నాసిక్‌ : మహారాష్ట్రలోని నాసిక్‌ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఆటో, బస్సు ఒకదానినొకటి ఢీకొని అనంతరం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయాయి. బస్సు మాలెగావ్ నుంచి కల్వాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే మందుగా ఆటో దాని మీద నుంచి బస్సు పడడంతో ఆటోలో ఉన్న ప్రయాణికులు నలిగిపోయారు.

నీటిలో మునిగి ఊపిరాడక చాలా మంది చనిపోయారు. నాసిక్‌లోని దియోలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఇప్పటి వరకు 23 మంది చనిపోయారు. మరో 30 మందిని రెస్క్యూ సిబ్బంది, స్థానికులు బయటకు తీశారు. వారిలో పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బావి లోతు 70 అడుగులు ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు