పెళ్లింట విషాదం

6 Mar, 2020 13:31 IST|Sakshi
ప్రమాదానికి గురైన కారు

పెళ్లి ముగించుకుని వస్తుండగా కారు బోల్తా  

వరుడి తాత దుర్మరణం

తండ్రి, అవ్వ, డ్రైవర్‌కు గాయాలు

కర్నూలు, వెల్దుర్తి: మనుమడి పెళ్లి ముగించుకుని తిరుగు ప్రయాణంలో తాత దుర్మరణం పాలైన దుర్ఘటన ఎన్‌హెచ్‌–44పై మండల పరిధిలోని మల్లెపల్లె స్టేజ్‌ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణగిరి మండలం కొత్తూరుకు చెందిన దాదిరెడ్డిగారి అయ్యపు రెడ్డి (80), భార్య రంగనాయకులమ్మలకు ఇద్దరు కుమారులు, నలుగురు కూతుర్లు ఉన్నారు. ఒక కూతురును డోన్‌కు చెందిన ధర్మారెడ్డితో వివాహం చేశాడు. ధర్మారెడ్డి కుమారుడి పెళ్లి కర్నూలు టౌన్‌లో గురువారం జరిగింది. ఈ పెళ్లి ముగించుకుని వధూవరులు, కుటుంబ సభ్యులు, బంధువులు తిరుగు ప్రయాణమయ్యారు. ఒక కారులో దాదిరెడ్డి అయ్యపురెడ్డి, భార్య రంగనాయకులమ్మ, అల్లుడు ధర్మారెడ్డి, మరో బంధువు నాగవర్ధనరెడ్డి వస్తున్నారు.

మార్గం మధ్యలో మలుపు వద్ద అదుపుతప్పిన కారు పక్కనే ఉన్న రైలింగ్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న దాదిరెడ్డిగారి అయ్యపురెడ్డి ఆక్కడికక్కడే మరణించారు. వాహనదారులు, ముందు, వెనుక ప్రయాణిస్తున్న బందువులు ఘటనాస్థలికి చేరుకు ని కారులో ఇరుక్కున్న ధర్మారెడ్డి, రంగనాయకులమ్మ, నాగవర్ధనరెడ్డిలను బయటికి లాగారు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి పురాతన బావి గట్టున ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు