సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో కీచకుడు

26 Feb, 2018 08:03 IST|Sakshi

మహిళా అటెండర్లను వేధిస్తున్న కారు డ్రైవర్‌  

పట్టించుకోని ఆసుపత్రి అధికారులు

మెహిదీపట్నం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళా రోగులు, వారికి సహాయకులకు కనీస రక్షణ లేకుండా పోయింది. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాల్సిన సిబ్బంది వారిపాలిట కీచకుల్లా మారుతున్నారు. సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో డ్రైవర్‌గా పని చేస్తున్న శివ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తప్పతాగి ఓ రోగిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలి బంధువులు హుమాయిన్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం కంటి పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేరిన రోగి పట్ల అతను శనివారం రాత్రి అసభ్యంగా ప్రవర్తించాడు.

తాను చెప్పినట్లు వింటే అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించడంతో పాటు, త్వరగా సర్జరీ కూడా చేయిస్తానని చెప్పాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో  డ్రైవర్‌ శివపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ఉదయం రోగుల, సహాయకులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో హుమాయూన్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రాజు తెలిపారు.  

మరిన్ని వార్తలు