సినీ ఆర్టిస్ట్‌ కళ్యాణి ఆత్మహత్యపై అనుమానాలు?

13 Jan, 2020 07:08 IST|Sakshi
ప్రసాద్, కళ్యాణి పెళ్లి ఫొటో(ఫైల్‌)

అమీర్‌పేట: సినీ ఆర్టిస్ట్‌ కళ్యాణి ఆత్మహత్యపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోంగార్డుగా పనిచేస్తున్న ఆమె భర్త ప్రసాద్‌ కళ్యాణిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని మృతురాలి తల్లి సూరినేనమ్మ ఆరోపించింది. ఈ మేరకు తెలంగాణ సినీ,ఆర్టిస్ట్‌ యూనియన్‌ నాయకులతో కలిసి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా, భీమడోలు మండలం, కుల్లా గ్రామానికి చెందిన కళ్యాణి మొదటి భర్తతో విడాకులు తీసుకుని కుమార్తెతో సహా నగరానికి వలస వచ్చింది. ఈవెంట్లు నిర్వహిస్తూ సినిమాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న ప్రసాద్‌తో ఏర్పడిన పరిచయం  పెళ్లికి దారితీసింది. ఇదిలా ఉండగా ఈ నెల 10న కళ్యాణి బల్కంపేట లింగయ్యనగర్‌లోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి భర్త ప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఆర్టీఓ సమక్షంలో పంచనామా నిర్వహించారు. శనివారం రాత్రి ఈఎస్‌ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా అక్కడికి వచ్చిన సినీ మూవీ, ఆర్టిస్ట్‌ యూనియన్‌ నాయకులు కళ్యాణి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళకు దిగారు. మృతురాలి ఒంటిపై గాయాలు ఉన్నాయని, ఆమె భర్త ప్రసాద్‌ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని  ఆరోపించారు. అంతే కాకుండగా సొంత తల్లి సూరినేనమ్మకు సమాచారం అందించకుండా సవతి తల్లి సావిత్రి సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించడం ఏమిటన్నారు. ఆదివారం ఉదయం నగరానికి చేరుకున్న కళ్యాణి తల్లి సూరినేనమ్మ కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్తికోసం ప్రసాద్‌ కళ్యాణిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పేర్కొంది. 8 నెలల క్రితం వారు వివాహం చేసుకున్నట్లు స్నేహితులు చెబుతుండగా రెండేళ్ల క్రితమే వివాహం చేసుకున్నట్లు ప్రసాద్‌ పేర్కొంటున్నాడన్నారు.

తమ ఎదుటే గొంతు పట్టుకున్నాడు...
కాగా కళ్యాణి, ప్రసాద్‌ ఓ యూట్యూబ్‌ చానెల్‌ నడుపుతున్నారని, మొట్టమొద తనను ఇంటర్వ్యూ చేసేందుకు ఇంటికి పిలిపించారని డ్యాన్స్‌ మాస్టర్‌ రాకేష్‌ తెలిపాడు. ఇంటర్వ్యూ అనంతరం రాత్రి వారి ఇంట్లోనే ప్రసాద్‌తో పాటు తాను, పౌల్, సుహాల్‌ మద్యం తాగామన్నారు. ఈ సందర్భంగా కళ్యాణి, ప్రసాద్‌ మధ్య గొడవ జరగడంతో ప్రసాద్‌ కళ్యాణి గొంతుపట్టుకున్నాడని రాకేష్‌ తెలిపాడు. అతడికి నచ్చజెప్పి  వెళ్లిపోయామన్నాడు. ఉదయం చార్జర్‌ కోసం ప్రసాద్‌కు ఫోన్‌ చేయగా కళ్యాణి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడన్నారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు...
కళ్యాణి మృతికి ఆమె భర్త ప్రసాదే కారణమని ఆరోపిస్తూ ఆమె తల్లి ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఆర్‌నగర్‌ ఇన్స్‌పెక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే ఆమె కుమార్తె తాను తండ్రి వద్ద ఉండనని చెప్పడంతో ఆమెను నింబోలి అడ్డలోని ప్రభుత్వ వసతి గృహానికి తరళించినట్లు తెలిపారు. కళ్యాణి తన కూతురని మొదట సావిత్రి అనే మహిళ ఫిర్యాదు చేసిందని, తాజాగా సూరినేనమ్మ అనే మహిళ వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మృతికి గల కారణాలు వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు