పరిటాల అనుచరుల రౌడీరాజ్యం

15 Jun, 2018 11:22 IST|Sakshi

సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని పరిటాల అనుచరులు కిడ్నాప్‌ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఉండే సయ్యద్‌ పాషాను పరిటాల వర్గం కిడ్నాప్‌ చేసి, మంత్రి స్వగ్రామమైన వెంకటాపురానికి తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టారు.

రూ. 4 కోట్లు ఇవ్వాలని బెదిరించి, బాధితుడి బ్యాంక్‌ అకౌంట్ నుంచి రూ. 30 లక్షలు తీసుకుని అతడిని విడిచిపెట్టారు. దీంతో సయ్యద్‌ పాషా కర్ణాటకలోని బాగేపల్లిలో పోలీసులును అశ్రయించాడు. పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ అనుచరుడు భాస్కర్‌ నాయుడు సహా 8 మందిపై చర్యలు తీసుకోవాలని అతను ఫిర్యాదు చేశాడు. కర్ణాటక పోలీసులు ఈ కేసును అనంతపురం ఫోర్త్‌ టౌన్‌ పీఎస్‌కు బదిలీ చేశారు.

పరిటాల వర్గీయులు ఆగడాలు పెచ్చుమీరుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పరిటాల వర్గీయుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు