నటి నీలాణిపై కేసు నమోదు

23 Sep, 2018 09:48 IST|Sakshi

పెరంబూరు: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బుల్లితెర నటి నీలాణిపై మధురవాయిల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మధ్య తూత్తుక్కుడి స్టెర్‌లైట్‌ పోరాట దృశ్యాలను పోలీసు దుస్తులు ధరించి అనధికారంగా చిత్రీకరించి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి సంచలన సృష్టించిన నటి నీలాణి. ఈ సంఘటనలో అరెస్ట్‌ అయ్యి బెయిల్‌పై విడుదలై మళ్లీ టీవీ.సీరియళ్లలో నటిస్తున్న ఈ అమ్మడు తనను పెళ్లి చేసుకోమని వెంటపడుతున్న ప్రియుడు గాంధీలలిత్‌కుమార్‌ అనే సహాయ దర్శకుడిపై స్థానిక మైలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి మరోసారి వార్తల్లోకెక్కింది. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న అవమానం, విరక్తితో గాంధీ లలిత్‌కుమార్‌ నిప్పంటించుకుని మరణించాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టడంతో నీలాణి పరారైంది.

ఆ తరువాత చెన్నై పోలీస్‌కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి గాంధీలలిత్‌కుమార్‌ ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఒక లేఖలో పేర్కొని ఇచ్చింది. ఇలాంటి పరిస్థితిలో గాంధీలలిత్‌కుమార్‌ సోదరుడు తన తమ్ముడి మరణానికి నీలాణినే కారణం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గత 20న స్థానిక ఆలపాక్కం, అష్టలక్ష్మీనగర్‌ రెండవ వీధిలో నివశిస్తున్న నీలాణి తన ఇంట్లో దోమల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు ఏడుస్తుండం గమనించిన చుట్టు పక్కల వారు వెంటనే నీలాణిని స్థానిక రాయపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న నీలాణిపై ఆత్మహత్యానేరం క్రింద మధురవాయిల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో మరిన్ని  విషయాలు బయట పడే అవకాశం ఉంటుందని పోలీస్‌ వర్గాలు అంటున్నారు.

>
మరిన్ని వార్తలు