తబ్లిగి సభ్యులకు ఆశ్రయం.. కేసు నమోదు

13 Apr, 2020 14:26 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో ప్రార్థనలకు వెళ్లివచ్చినవారికి ఆశ్రయం కల్పించిన పలువురిపై హాబీబ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి నెలలో ప్రార్థనలకు వెళ్లొచ్చినవారిలో కొందరికి హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో స్థానిక జమాత్‌ నాయకులు ఆశ్రయం కల్పించినట్టుగా పోలీసులు గుర్తించారు. వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ తబ్లిగి జమాత్‌ సభ్యులకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు. దీంతో తెలంగాణ తబ్లిగి జమాత్‌ అధ్యక్షుడు ఇక్రమ్‌ అలితోపాటు మరో 10 మందిపై ఏపిడమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇక్రమ్‌ అలీ మాత్రం తాము నిబంధనలు ఉల్లంఘించలేదని, ఎవరికి ఆశ్రయం కల్పించేదని తెలిపారు.

కాగా, కొద్ది రోజుల కిందట ఇక్కడ ఆశ్రయం పొందిన అందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించిన అధికారులు.. ఇక్రంతో సహా పలువురుని క్వారంటైన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అలాగే ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. మరోవైపు తెలంగాణలో నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం మర్కజ్‌తో సంబంధం ఉన్నవేనని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో 531 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 16 మంది మృతిచెందారు. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు