బాలికలతో వెట్టి చాకిరి.. యాంకర్‌పై కేసు నమోదు

28 Feb, 2020 21:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కృష్ణా : ఇద్దరు బాలికలతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న ఓ టీవీ యాంకర్‌పై శిశు సంక్షేమ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేశారు. శిశు సంక్షేమ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడులోని చైల్డ్ కేర్‌లో చదువుకుంటున్న ఇద్దరు బాలికల్ని పండుగ సెలవుల పేరుతో తల్లి హైదరాబాద్ తీసుకెళ్లింది. దీనిలో భాగంగానే నగరంలోని ఓ టీవీ యాంకర్ ఇంట్లో బాలికల్ని పనికి కుదిర్చింది. అయితే సెలవులు ముగిసినప్పటికీ.. బాలికలు చైల్డ్‌ కేర్‌కి తిరిగిరాకపోవడంతో సీసీఐ అధికారులు మిస్సింగ్ కేసు పెట్టారు. అనంతరం బాలికల మిస్సింగ్‌పై దర్యాప్తు చేయగా.. హైదరాబాద్‌లో టీవీ యాంకర్ ఇంట్లో వెట్టిచాకరి చేస్తున్నట్టు శిశు సంక్షేమ కమిటీ గుర్తించింది. ఈ క్రమంలోనే ఇద్దరు బాలికల్ని కమిటీ సభ్యులు అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు బయటపడ్డాయి.

ఇంటి పనితో పాటు బాడీ మసాజ్ లాంటి పనులను సైతం వారితో చేయించుకుంటున్నట్లు బాలికలు తెలిపారు. దీంతో సీడబ్ల్యూసీ సభ్యుల ఫిర్యాదు మేరకు నూజివీడు పోలీసులు ఆ యాంకర్‌పై కేసు నమోదు చేశారు. మైనర్లని పనిలో పెట్టుకోవడం, వెట్టిచాకిరి చేయించుకోవడం చట్టరిత్యా నేరంమని వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు పిల్లల్ని తన ఇంట్లో పనికి పెట్టుకుని.. వివరాలు అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని సీడబ్ల్యూసీ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.


 

>
మరిన్ని వార్తలు