నకిలీ బంగారంతో బురిడీ

25 Jun, 2019 06:58 IST|Sakshi

సాక్షి, అవుకు(కర్నూలు) : మండలంలోని రామాపురం ఆంధ్రాబ్యాంక్‌లో పని చేస్తున్న ఓ వ్యక్తి బ్యాంక్‌నే బురిడీ కొట్టించాడు. నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.40 లక్షల వరకు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. బ్యాంక్‌కు కొత్త మేనేజర్‌ రావడంతో ఈ వ్యవహారం సోమవారం వెలుగులోకి వచ్చింది. రామాపురంలోని ఆంధ్రాబ్యాంక్‌లో కాంట్రాక్ట్‌ ప్రతిపదికన గోల్డ్‌ అౖప్రైజర్‌గా శ్రీనివాసులు అనే వ్యక్తి   నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. రుణాల కోసం ఖాతాదారులు తెచ్చే బంగారం సరైనదా లేదా అని బ్యాంక్‌ అధికారులకు ఈయన నివేదిక అందిస్తారు.

అనంతరం రుణాలు మంజూరు అవుతాయి. అయితే నమ్మకంగా ఉండాల్సిన గోల్డ్‌ అప్రైజర్‌..అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. చనుగొండ్ల, శింగనపల్లె, అవుకు చెందిన 12 మంది ఖాతాదారుల సంతాకాలు తీసుకొని నకలీ బంగారాన్ని తనఖా పెట్టి  బ్యాంక్‌ డబ్బును కాజేశాడు. ఇటీవల మేనేజర్‌ లింగన్న బదిలీ కాగా.. నంద్యాల శివారులోని ఉడుమార్పరం ఎస్‌బీఐ శాఖ నుంచి రామాపురానికి నవీన్‌ కుమార్‌ రెడ్డి బ్యాంక్‌ మేనేజర్‌ బదిలీపై వచ్చారు. ఖాతాదారులకు సంబంధించి అకౌంట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, అలాగే రుణాలకు సంబంధించిన వివరాలు నూతన మేనేజర్‌కు అప్పజేప్పే క్రమంలో నకిలీ బంగారం వ్యవహారం బట్టబయలైంది. సంబంధిత రైతులను విచారించగా తాము ఎలాంటి రుణాలు పొందలేదని చెప్పడంతో సదరు గోల్డ్‌ అప్రైజర్‌ శ్రీనువాసులు అక్రమాలు బయటపడ్డాయి.      

మరిన్ని వార్తలు