‘ఆస్పత్రిపై దాడి చేసిన వారిని త్వరలోనే అరెస్టు చేస్తాం’

25 Dec, 2018 17:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతిచెందడంతో ఆమె తరుపు బంధువులు విధ్వంసం సృష్టించిన ఘటన సోమవారం రాత్రి గ్లెనిగల్‌ గ్లోబల్‌ హాస్పిటల్‌లో చోటు చేసుకుంది. అడ్డువచ్చిన స్టాఫ్‌ను, సెక్యూరిటీని చితకబాదారు. దీనిపై సెంట్రల్‌జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్‌  మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిన్న రోగి బంధువులు హాస్పిటల్‌లో విధ్వంసం సృష్టించిన ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. సంతోష్‌ నగర్‌కు చెందిన షమీనా బేగం స్వైన్‌ ఫ్లూ, ఊపిరితిత్తుల వ్యాధితో మృతిచెందినట్లు హాస్పిటల్‌ రికార్డులో ఉందని విశ్వప్రసాద్‌ తెలిపారు. 

సిబ్బంధిపై దాడి చేసి, ఫర్నీచర్‌ను కూడా ధ్వంసం చేశారని హాస్పిటల్‌ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. దాడిచేసిన ముగ్గురు అన్నదమ్ములను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ధ్వంసం చేసిన ఆస్పత్రి ఆస్తులను రికవరీ చేసేలా కేసులు పెట్టామని తెలిపారు. విధుల్లో ఉన్న పోలీస్‌సిబ్బంధిపై కూడా దాడి చేశారని, వాటిపైనా కేసులు పెట్టామన్నారు. వాళ్లు పారిపోకుండా దృష్టి పెట్టామని, దీనిపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదన్నారు. 

మరిన్ని వార్తలు