సాక్షి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమాపై కేసు నమోదయింది. ఎన్నికల ప్రచారంలో దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడిన ఘటనలో బొండా ఉమాతోపాటు ఆయన కుమారులు సిద్ధార్థ, రవితేజలపైనా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8న విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సిద్ధార్థ, రవితేజలు రౌడీయిజానికి పాల్పడిన సంగతి తెలిసిందే. మైకులో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా పారిశ్రామికవేత్త కోగంటి సత్యంపై దౌర్జన్యానికి దిగారు. ఇంతలో అక్కడికి వచ్చిన బొండ ఉమా ‘నీ అంతు చూస్తా’ అంటూ సత్యంపై బెదిరింపులకు దిగారు. ఈ ఘటనపై ఫిర్యాదు రావడంతో.. అజిత్సింగ్ నగర్ పోలీసులు బొండా ఉమతోపాటు ఆయన కుమారులపై కేసు నమోదు చేశారు.