మాటేసి... దోచేసి!

22 Jul, 2019 10:52 IST|Sakshi
బాధితురాలిని పరామర్శిస్తున్న మహిళా కమిషన్‌ సభ్యురాలు రమాదేవి 

కారంచేడు ఎంట్రన్స్‌లో లైంగిక దాడులు

ఏకాంతం కోరుకునే ప్రేమికులు, ఇతర జంటలను టార్గెట్‌ చేస్తూ ఓ ముఠా దోపిడీలు, లైంగిక దాడులకు పాల్పడుతోంది. వీరు తమ అఘాయిత్యాలకు కారంచేడు సమీపంలోని కాలువకట్టను అనువైన ప్రదేశంగా ఎంచుకున్నారు. ఆవైపు ఎవరైనా జంటలు సరదాగా వస్తే వారిని వెంబడించి బెదిరించి డబ్బు, బంగారం, సెల్‌ఫోన్లు దోపిడీ చేయడం, పరిస్థితులను బట్టి మహిళలు, యువతులపై లైంగిక దాడులకు పాల్పడటం చేస్తున్నారు. ఈ ప్రదేశంలో ఇటువంటి సంఘటనలు గతంలో పలుమార్లు జరిగాయి. తాజాగా శుక్రవారం నాటి సంఘటనతో పోలీసులు, ప్రజలు ఉలిక్కిపడ్డారు. 

సాక్షి, పర్చూరు: కొత్తవారు ఎవరైనా కారంచేడులో అడుగు పెట్టిన వెంటనే ఓ ముఠా ప్రేమజంటలను టార్గెట్‌ చేస్తోంది. చీరాలకు చెందిన ఒక ముఠా కొన్నేళ్లుగా ప్రేమ జంటలను టార్గెట్‌ చేసి వారి వద్ద డబ్బు, విలువైన వస్తువులతో పాటు కొన్ని సందర్భాల్లో లైంగికదాడులకు సైతం పాల్పడుతున్నారు. కేవలం కొందరు ప్రేమజంటలు, వివాహేతర సంబంధాలున్న జంటలు ఈ ముఠాకు బలి అవుతున్నారు. 

– ప్రస్తుతం జరిగింది ఇలా..
మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి లైంగిక దాడికి పాల్పడటంపై కారంచేడు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. సంచలనం రేపిన ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చీరాల విఠల్‌ నగర్‌కు చెందిన మహిళకు చెరుకుపల్లికి చెందిన వ్యక్తితో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఓ పాప ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఒకటిన్నర సంవత్సరం కిందట ఇద్దరూ విడిపోయారు. భర్తతో విడిపోయిన ఆ యువతి తల్లిదండ్రుల వద్ద చీరాలో ఉంటోంది. ఆమెకు కొత్తపాలెంనకు చెందిన శివారెడ్డితో పరిచయమైంది. అది వారిద్దరి మధ్య మరింత సాన్నిహిత్యాన్ని పెంచింది. ఈనెల 19వ తేదీ శుక్రవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో వారిరువురు కలిసి ద్విచక్రవాహనంపై కారంచేడు కాలువ కట్ట వద్దకు వెళ్లారు. ఆ సమయంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వారి వద్దకు వచ్చి ఒకరు శివారెడ్డిని గట్టిగా పట్టుకొన్నారు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు మహిళను బలవంతంగా పక్కకు ఈడ్చుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆగంతకులు శివారెడ్డి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను, రూ. 2,300 నగదును తీసుకొని పారిపోయినట్లు బాధితులు చెప్తున్నారు. శనివారం బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై బి. నరసింహారావు  కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

విచారణ వేగవంతం.. 
మహిళపై గుర్తు తెలియని వ్యక్తుల సామూహిక లైంగిక దాడికి సంబంధించిన ఫిర్యాదుపై విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే నిందితులను గుర్తించినట్లు సమాచారం. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసు అధికారులు చెప్తున్నారు. 

గతంలో జరిగింది ఈ ప్రాంతంలోనే..
2018 నవంబరు 25న చీరాల హయ్యర్‌పేటకు చెందిన బొనిగల సాల్మన్, మరొక మహిళ ద్విచక్రవాహనంపై కారంచేడు రోడ్డులోని కుర్తుల చప్టా మీదుగా వెళుతుండగా చీరాలలోని దండుబాటలో నివసించే దాన గోపి, జయశంకర్‌ నగర్‌కు చెందిన అన్నం సుధాకర్‌బాబులు పోలీసుల మని చెప్పి వారిని అడ్డుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4500 నగదులో పాటు సెల్‌ఫోన్‌ను బలవంతంగా తీసుకున్నారు. సాల్మన్‌తో పాటు ఉన్న మహిళను బలవంతంగా లాక్కొని వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం నిందితులు ద్విచక్రవాహనం పై పారిపోయారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి రూరల్‌ సీఐ పి. భక్తవత్సలరెడ్డి నేతృత్వంలో ఎస్సై పున్నారావు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకొని అరెస్ట్‌ చేశారు. 

ప్రియుడి ప్లానేనా..?

– బాధితురాలిని పరామర్శించిన మహిళా కమిషన్‌ సభ్యురాలు
చీరాల:
అత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని మహిళా కమిషన్‌ సభ్యురాలు రమాదేవి అన్నారు. చీరాల–కారంచేడు రోడ్డులో కారంచేడు సమీపంలోని కాలువ బ్రిడ్జి వద్ద రెండు రోజులు క్రితం చీరాల విఠల్‌నగర్‌కు చెందిన మహిళ, మరో వ్యక్తి ఏకాంతంగా మాట్లాడుతున్న సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇరువురు దాడి చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు కారంచేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

ఘటనలో బాధితురాలిని చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. బాధితురాలిని ఆదివారం మహిళా కమిషన్‌ సభ్యురాలు రమాదేవి ఏరియా వైద్యశాలకు వెళ్లి పరామర్శించారు. జరిగిన సంఘటన గురించి వివరాలను అమెను అడిగి తెలుసుకున్నారు. కారకులైన వారికి శిక్ష పడేలా చేసి న్యాయం చేస్తామన్నారు. ఆమె వెంట ఐసీడీఎస్‌ అర్బన్‌ సీడీపీఓ బి.నాగమణి ఉన్నారు. ఈ సంఘటనలో లైంగికదాడి చేసిన వారితో ఆమె ప్రియుడికి కూడా సంబంధం ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు