జీడిపిక్కల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం: 9 కోట్ల ఆస్తి నష్టం

8 Dec, 2019 11:11 IST|Sakshi
ప్రమాదంలో కాలిపోయిన జీడిగింజలు

ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

సాక్షి, రావులపాలెం (కొత్తపేట): మండలం ఈతకోటలో ఉన్న శ్రీదావన్‌ క్యాషు నట్స్‌ జీడిపిక్కల ఫ్యాక్టరీలో శనివారం తెల్లవారు జామున విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. గౌడౌన్‌ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో గుర్తించి సిబ్బంది వెంటనే కొత్తపేట అగి్నమాకప అధికారులకు సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకున్న అగి్నమాపక అధికారి ఎన్‌. నాగభూషణం సిబ్బందితో కలసి మంటలు అదుపు చేసే చర్యలు ప్రారంభించారు. అయితే మంటలు అదుపులోకి రాకపోవడంతో మండపేట అగి్నమాపక సిబ్బందిని రప్పించారు. రెండు ఫైర్‌ ఇంజన్ల సాయంతో సుమారు ఆరు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో జీడిపిక్కలు పూర్తి కాలిపోవడంతో గౌడౌన్‌ మొత్తం మంటల వేడికి పగుళ్లు తీసింది. షట్టర్లు మూసి ఉండడంతో మంటలు అదుపు చేసేందుకు జేసీబీ సాయంతో గోడలు పగులగొట్టి షట్టర్లను తొలగించాల్సి వచ్చింది. అనంతరం కొత్తపేట, మండపేట ఫైర్‌ ఆఫీసర్లు ఎం.నాగభూషణం, అబ్రహం ఆధ్వర్యంలో  సుమారు పది మంది ఫైర్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. 

యజమాని నాగవెంకటరెడ్డిని ఓదార్చుతున్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డి 

ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి 
ప్రమాద విషయం తెలియగానే కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఫ్యాక్టరీకి చేరుకున్నారు. గోపాలపురానికి చెందిన ఫ్యాక్టరీ యజమాని సత్తి నాగవెంకటరెడ్డిని పరామర్శించారు. ప్రమాదానికి కారాణాలు అడిగి తెలుసుకున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని వెంకటరెడ్డి తెలిపారు. ఈ గోడౌన్‌లో సుమారు ఎనిమిది వేల బస్తాల జీడిపిక్కలు యంత్ర సామగ్రి ఉన్నాయని ప్రమాదంలో మొత్తం దగ్ధం అయ్యాయని కన్నీటి పర్యంతం అయ్యాడు. ఆస్తి నష్టం సుమారు రూ. 9 కోట్లు ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే వెంట సీఐ వి.కృష్ణ , గోపాలపురం మాజీ ఉప సర్పంచ్‌ చిర్ల రామచంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి, తదితరులు ఉన్నారు. కొత్త గోడౌన్‌లోకి మార్చేలోపే ప్రమాదం గతంలో ఒకసారి ఎలుకలు విద్యుత్‌ తీగలు కొరకడం వల్ల షార్ట్‌ సర్క్యూట్‌ జరిగినా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. దానిని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి పక్కన కొత్తగా రూ. 1.30 కోట్లతో గోడౌన్‌ నిర్మించాం. ఈ సరుకును ఆ గౌడౌన్‌లోకి మార్చుదామని అనుకున్నాం. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. 
-సత్తి నాగవెంకటరెడ్డి, ఫ్యాక్టరీ యజమాని, గోపాలపురం  

మరిన్ని వార్తలు