సుజనా ఇంట్లో సీబీఐ సోదాలు

2 Jun, 2019 02:10 IST|Sakshi

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా 12 చోట్ల ఏకకాలంలో దాడులు 

ఉదయం 8 నుంచి రాత్రి 11 గం. వరకు తనిఖీలు 

 హైదరాబాద్‌లోని సుజనా గ్రూప్‌ కార్యాలయం సీజ్‌.. పలు హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం

సాక్షి, హైదరాబాద్‌ : బ్యాంకు రుణాల ఎగవేత కేసులో టీడీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు బృందాలుగా విడిపోయి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కలిపి మొత్తం 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పలు హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకోవడంతోపాటు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని సూజనా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయాన్ని సీజ్‌ చేశారు. ఉదయం 8 గంటలకు మొదలైన సోదాలు రాత్రి 11 గంటలకు ముగిశాయి. బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొని ఎగవేసిన కేసులో సీబీఐ అధికారులతోపాటు బ్యాంకింగ్‌ ఫ్రాడ్‌ సెల్‌ టీం సభ్యులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. నకిలీ బిల్లులు సృష్టించి పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి పొందిన నిధులను ఇతర మార్గాల్లో డొల్ల కంపెనీలకు తరలించినట్లు సుజనా చౌదరిపై సీబీఐ అభియోగాలు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసులో మనీలాండరింగ్‌ కింద ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా దర్యాప్తు చేస్తోంది. అయితే తాజాగా జరిగిన దాడులు మాత్రం సీబీఐ ఇటీవల సుజనాపై నమోదు చేసిన మరో కేసుకు సంబంధించినవి కావడం గమనార్హం. ఇందుకు సంబం«ధించి నలుగురు డైరెక్టర్లు శ్రీనివాస కల్యాణ్‌రావు, వెంకట రమణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, రామకృష్ణ వర్మను అదుపులోకి తీసుకొని విచారించారు. 


హైదరాబాద్‌లోని సుజనా గ్రూప్‌ కార్యాలయాన్ని సీజ్‌ చేసిన దృశ్యం, సుజనా ఇంట్లో తనిఖీల అనంతరం తిరిగి వెళ్తున్న సీబీఐ అధికారులు 
ఏం జరిగిందంటే? 
బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ (బీసీఈపీఎల్‌) కంపెనీ సుజనా గ్రూప్‌నకు చెందింది. దీన్ని సుజనా చౌదరి సీబీఐ మాజీ చీఫ్‌ విజయ రామారావు కుమారుడితో కలసి ఏర్పాటు చేశారు. చెన్నైలోని ఆంధ్రా బ్యాంకు, సెంట్రల్‌ బ్యాంకు, కార్పొరేషన్‌æ బ్యాంకుల నుంచి 2010 నుంచి 2013 మధ్యకాలంలో రూ. 364 కోట్లు రుణం తీసుకుంది. బీసీఈపీఎల్‌కు రుణం ఇచ్చేందుకు ఈ బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఈ మొత్తంలో ఆంధ్రా బ్యాంకు రూ. 71 కోట్లు, కార్పొరేషన్‌ బ్యాంకు నుంచి రూ. 120 కోట్లు, సెంట్రల్‌ బ్యాంకు నుంచి రూ. 124 కోట్లు తీసుకున్నారు. ఈ రుణాలను గంగా స్టీల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, భాగ్యనగర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ట్రేడింగ్‌ లిమిటెడ్, తేజస్విని ఇంజనీరింగ్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌ టెక్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలకు బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు సీబీఐ ఆధారాలు, పత్రాలు సేకరించింది. ప్రస్తుత దాడులు ఆంధ్రా బ్యాంకుకు సంబంధించి రూ. 71 కోట్ల ఎగవేతకు సంబంధించినవి కావడం విశేషం.  

అన్నీ డొల్ల కంపెనీలే... 
బ్యాంకు రుణాన్ని ఎగవేసిన కేసులో బ్యాం కుల ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. కాకులమర్రి శ్రీనివాసరావుతో కలిపి ఐదుగురు డైరెక్టర్లు, మేనేజింగ్‌ డైరెక్టర్‌పై సీబీ ఐ కేసులో నిందితులుగా చేర్చింది. బ్యాంకు రుణాల రూపంలో పొందిన మొత్తాన్ని సుజ నా బినామీ కంపెనీలకు నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించి బదిలీ చేసినట్లు సీబీఐ విచారణలో గుర్తించింది. ఇందుకోసం పలు డొల్ల కంపెనీలను సృష్టించినట్లు,  మనీలాండరింగ్‌ జరిగిన ట్లు తేల్చింది. దీంతో మనీలాండ రింగ్‌ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి బదిలీ చేసింది. సుజనా గ్రూప్‌లో భారీగా డొల్ల కం పెనీలున్నట్లు ఈడీకీ ఆధారాలు లభించాయి. సుజనా సృష్టించిన వైస్రాయ్‌ హోటల్స్‌ అండ్‌ మహల్‌ హోటల్‌కు పొందిన రుణంలో నుంచి నగదును బదిలీ చేశారు. దీంతో వైస్రాయ్‌ హోటల్స్‌ అండ్‌ మహల్‌ హో టల్‌కు చెందిన రూ. 315 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఏప్రిల్‌లో అటాచ్‌ చేసింది. మనీ లాండరింగ్‌ యా క్ట్‌ ప్రకారం హైదరా బాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరులోని ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.

మరిన్ని వార్తలు