పెట్రోల్‌ టు సెల్‌ఫోన్‌!

29 Nov, 2018 09:32 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ భిక్షం రెడ్డి

చిల్లర’తో మొదలు పెట్టి స్నాచర్‌గా మారిన దొంగ

మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వరుస నేరాలు

నారాయణగూడ పరిధిలో అరెస్ట్‌

ఐదు సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లు స్వాధీనం

హిమాయత్‌నగర్‌: వాహనాల్లో పెట్రోల్‌ కొట్టేయడంతో చోరీలకు శ్రీకారం చుట్టిన ఓ యువకుడు సెల్‌ఫోన్లు చోరీ చేసేస్థాయికి ఎదిగాడు. ఇప్పటికే 10 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతను జైలుకు వెళ్లినా బుద్ధి మార్చుకోకుండా మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడి సెల్‌ఫోన్ల చోరీలకు పాల్పడుతున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఈ ముఠాను నారాయణగూడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అబిడ్స్‌ ఏసీపీ భిక్షంరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

ఐఎస్‌ సదన్‌కు చెందిన పోతుల అరవింద్‌ చిన్నతనం నుంచే దోపిడీ, దొంగతనాలను పాల్పడుతున్నాడు. సరోజనీకాలనీకి చెందిన గంజి వికాస్, కంచన్‌బాగ్‌లోని దామోదర్‌ సంజివయ్య నగర్‌కు చెందిన జవడి కార్తీక్‌లతో కలసి ముఠాగా ఏర్పడిన అతను పలు ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. ఈ నెల 17న హిమాయత్‌నగర్‌ ప్రధాన రహదారిపై ఓ వ్యక్తి క్యాబ్‌ బుక్‌ చేసుకుంటుండగా వెనక నుంచి వికాస్, కార్తీక్‌ అతడి సెల్‌ఫోన్‌ లాక్కుని బైక్‌పై పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 24న లిబర్టీ వద్ద ఓ యువకుడు ఫోన్లో మాట్లాడుతుండగా అరవింద్, కార్తీక్‌లు వెనక నుంచి వచ్చి అతడి ఫోన్‌ లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన ఆధారాలతో అరవింద్, కార్తీక్‌లను అరెస్ట్‌ చేసినట్లు క్రైం
ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. 

గ్యాంగ్‌ పెద్దదే
నాలుగేళల్లో అరవింద్‌కు పరిచయమైన ప్రతి వ్యక్తిని మచ్చిక చేసుకుని వారికి కొంత డబ్బులు ఇచ్చి చోరీలకు వినియోగించుకున్నట్లు విచారణలో వెల్లడైయ్యింది. స్కూల్‌ పిల్లలు మొదలు, కాలేజీ విద్యార్థుల వరకు పలువురిని తన దొంగతనాల్లో భాగస్వాములను చేసుకున్నట్లు గుర్తించారు.  బంధిపోటు దొంగతనం, ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన అరవింద్‌ పెద్ద నేరాలు చేసి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. 

పది కేసులు, రెండు సార్లు జైలుకు
పోతుల అరవింద్‌పై రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పది కేసులు ఉన్నాయి. 16ఏళ్ల వయసులో పెట్రోల్‌ దొంగతనాలతో చోరీలు ప్రారంభించిన అతను అనంతరం మూడు దోపిడీ కేసుల్లో అరెస్టయ్యాడు. సరూర్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో మరో రెండు దోపిడీ కేసులు, ఒక సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌ కేసుల్లో పోలీసులకు చిక్కాడు. చైతన్యపురి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఒక రాబరీతో, బందిపోటు దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు. హయత్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో ఓ ఇంట్లో బంగారం, డబ్బు దొంగలించాడు.  పది కేసులకు సంబంధించి రెండు పర్యాయాలు జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు తెలిపారు. తాజాగా నారాయణగూడ, సుల్తాన్‌బజార్‌ పీఎస్‌ పరిధిలో సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌ కేసులు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు