చైన్‌ స్నాచర్‌ అరెస్ట్‌: బుల్లెట్‌ స్వాధీనం

27 Nov, 2017 13:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కీసర పోలీసు స్టేషన్‌ పరిధిలో స్కూటర్‌పై వెళ్తున్న యువతిని అనుసరించిన ఓ దొంగ చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న వృద్ధ దంపతులు గమనించి  చైన్ స్నాచర్‌ను పట్టుకోబోగా అతను బైక్‌, చెప్పులు వదిలి పరారయ్యాడు. బైక్‌లో ఉన్న ఒక తపంచా, ఒక రౌండ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. తర్వాత చైన్‌స్నాచర్ మనోజ్ స్వైన్‌ను అరెస్టు చేశామని, ఇతను చిన్నప్పటి నుంచి నేరాలకు పాల్పడుతున్నాడని, జువైనల్ హోమ్ నుంచి పరారయ్యాడని వివరించారు. ఇతనికి సహకరించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనిల్, హకీమ్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని, గతంలో ఇతనిపై ఎనిమిది కేసులున్నాయని చెప్పారు. నిందితుడి నుండి ఒక కంట్రీమేడ్ తపంచా, బటన్ కత్తి, తొమ్మిది తులాల బంగారంను స్వాదీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు.  

ఉద్యోగాల ముఠా అరెస్టు
రైల్వే, ఎన్టీపీసీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న ముఠా గుట్టును ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు. నకిలీ ఐడి కార్డులతో నిరుద్యోగులకు ఈ ముఠా కుచ్చు టోపీ పెట్టింది. ఏడుగురు సభ్యులు గల ముఠా బోగస్‌ లెటర్ హెడ్స్ సృష్టించి అపాయింట్‌ మెంట్ లెటర్స్‌ తయారు చేస్తోంది. ముఠాలో ఓ మహిళ కూడా ఉంది. ముఠాను పట్టుకున్న ఎస్‌ఓటీ పోలీసులు వారి నుంచి రూ. 20 లక్షల నగదు, 7 సెల్‌ఫోన్లు, ఐడీ కార్డులు, బోగస్‌ అపాయింట్‌మెంట్లు, ల్యాప్‌టాప్‌, ప్రింటర్లను సీజ్‌ చేశారు. బ్యాక్‌ డోర్‌ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నిరుద్యోగులు నమ్మొద్దని, అలాంటి వారిపై పోలీసులకు తెలియజేయాలన్నారు.
 

మరిన్ని వార్తలు