వృద్ధురాళ్లే టార్గెట్‌.. 

1 Sep, 2019 12:46 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ పద్మజారెడ్డి

 చైన్‌ స్నాచర్‌ అరెస్ట్‌ 

సాక్షి, అల్వాల్‌: ఒంటరిగా ఉన్న వృద్ధురాళ్లనే టార్గెట్‌ చేసుకొని  చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న గొలుసు దొంగను  అల్వాల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం బాలనగర్‌ డీసీపీ పద్మజారెడ్డి వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి శృతినగర్‌కు చెందిన చేర్యాల రాజ్‌మనోహర్‌ ర్యాపిడో బైక్‌ రెంట్‌ ఆర్గనైజేషన్‌లో బైక్‌ అద్దెకు నడుపుతున్నాడు. జల్సాలకు అలవాటు పడిన సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. గత నెల 26న అల్వాల్‌ పరిధిలోని వెంకటరమరణ కాలనీకి చెందిన వెంకటమ్మ అనే మహిళ రోడ్డుపై నిలబడి ఉండగా  బైక్‌పై వచ్చిన రాజ్‌మనోహర్‌ ఆమెను చిరునామా అడిగినట్లు నటించి బం గారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం నిందితుడిని అరెస్ట్‌ చేసి అతడి నుంచి 6 బంగారు నగలు, బైక్, స్మార్ట్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. గత నెల 7న మల్కాజిగిరిలోనూ చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.  
యూ ట్యూబ్‌లో చూసి.... 
దొంగతనాలు చేయడం నిందితుడు యూ ట్యూబ్‌ ద్వారా నేర్చుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఒంటరిగా ఉన్న వృద్ధులను టార్గెట్‌ చేసుకునే ఇతను పోలీసులు, సీసీ కెమెరాలకు  బైక్‌ నంబర్‌ ప్లేట్‌ను ఓ వైపునకు వంచేవాడు. హెల్మెట్‌ ధరించడంతో ముఖం కనిపించకుండా జాగ్రత్త తీసుకునేవాడు. నిందితుడిని పట్టుకున్న పోలీసు బృందాన్ని డీసీపీ అభినందించారు. సమావేశంలో ఏసీపీ నర్సింగరావు, సీఐలు పులి యాదగిరి, రాంరెడ్డి,  వెంకట్‌రెడ్డి, డిఐ. శంకర్, ఎస్‌ఐ. నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు