మహిళ వాకింగ్ చేస్తుండగా గొలుసు తెంపడానికి ప్రయత్నం
ప్రతిఘటించడంతో కొడవలితో దాడి
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : చైన్స్నాచర్లు మరోసారి తెగబడ్డారు. బెంగళూరు ఉత్తర తాలూకా పరిధిలోని బాగలూరులో గొలుసు చోరీకి ప్రతిఘటించిన మహిళపై కొడవలితో దాడిచేసి గాయపరిచారు. బాగలూరు గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ శుక్రవారం సాయంత్రం వాకింగ్ చేస్తుండగా స్కూటీలో వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని గొలుసు లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. అయితే ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహించిన ఒక దుండగుడు కొడవలితో గాయపరిచి పరారయ్యారు. లక్ష్మి కేకలు విన్న స్థానికులు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. బాగలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.