-
హైదర్గూడలో పురుషుడి మెడలోని చైన్ దొంగతనం
సిగరెట్ కావాలని అడిగి గొలుసుతో ఉడాయింపు
సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు
రాజేంద్రనగర్: చైన్ స్నాచింగ్ అంటే ఇన్నాళ్లు మహిళలకే జరిగేది. కానీ ఇప్పుడు చైన్ స్నాచర్లు పురుషులను కూడా వదలడం లేదు. తాజాగా పురుషుడి మెడలోని బంగారు గొలుసు తెంచుకుని ఉడాయించిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ న్యూ ఫ్రెండ్స్ కాలనీలో రాఘవరెడ్డి మైత్రి కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాఘవరెడ్డి దుకాణంలో కూర్చుని ఉన్నాడు.
ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి వచ్చిన ఓ యువకుడు సిగరెట్ కావాలని అడిగాడు. సిగరేట్ ఇచ్చేందుకు రాఘవరెడ్డి కిందకు వంగాడు. ఇదే సమయంలో నిందితుడు రాఘవరెడ్డి మెడలోని మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుని ఉడాయించాడు. రెప్పపాటులో జరిగిన ఈ సంఘటనతో రాఘవరెడ్డి షాక్కు గురయ్యాడు. తెరుకుని బయటకు వచ్చేచూసేసరికి చైన్స్నాచర్ ద్విచక్రవాహనంపై పారిపోయాడు. రోడ్డుపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో చైన్ స్నాచర్ పారిపోయిన దృశ్యాలు నమోదయ్యాయి. ఇదే ప్రాంతంలో చైన్స్నాచర్ రెండు రోజులుగా రెక్కి నిర్వహిస్తూ సీసీ కెమెరాలో నమోదయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.