నకిలీ బంగారంతో బ్యాంక్‌కు బురిడీ

11 Mar, 2018 13:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇద్దరు మహిళలపై పోలీసులు కేసు నమోదు

నెల్లూరు(క్రైమ్‌): నకిలీ బంగారు గాజులు పెట్టి బ్యాంక్‌లో రుణం తీసుకుని మోసగించిన ఘటనలో ఇద్దరు మహిళలపై ఐదోనగర పోలీసులు శనివారం చీటింగ్‌ కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. టైలర్స్‌ కాలనీకి చెందిన సుగుణ, రంగనాయకులపేటకు చెందిన శైలజ స్నేహితులు.  ఈ నెల 1వ తేదీ కరెంట్‌ ఆఫీసు సెంటర్‌లోని సిండికేట్‌ బ్యాంక్‌ సుగణ తన పేరుపై ఖాతాను తెరిచింది. అదే రోజు నాలుగు బంగారు గాజులను బ్యాంక్‌లో పెట్టి రూ.82 వేలు రుణం తీసుకుంది.

మళ్లీ ఈ నెల 8న స్నేహితులిద్దరూ మరో నాలుగు (ఇంతకు ముందు కుదువ పెట్టిన) గాజులు తీసుకుని బ్యాంక్‌కు లోను కోసం వచ్చారు. అనుమానం వచ్చిన గోల్డ్‌ అప్రైజర్‌ విషయాన్ని బ్యాంక్‌ మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంక్‌ టైమ్‌ అయిపోయిందని మరుసటి రోజు రావాలని మేనేజర్‌ వారికి సూచించాడు. దీంతో వారు వెళ్లిపోయారు. అనంతరం బ్యాంక్‌ మేనేజర్‌ గతంలో లోను కోసం తాకట్టు పెట్టిన గాజులు, ప్రస్తుతం తీసుకు వచ్చిన గాజులను అప్రైజర్‌తో  తనిఖీ చేయించగా అన్నీ నకిలీవని తేలింది.

దీంతో మహిళలు బ్యాంక్‌ను మోసగించిన ఘటనపై శనివారం బ్యాంక్‌ అసిస్టెంట్‌ డిప్యూటీ మేనేజర్‌ ఎన్‌. రవికుమార్‌ ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సీహెచ్‌ కొండయ్య ఇద్దరు మహిళలపై చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు