చెన్నై రైల్వే స్టేషన్‌లో వెలుగు చూసిన దారుణం

15 Jun, 2019 10:29 IST|Sakshi

చెన్నై : పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో యువతిపై దాడి చేయడమే తనను తాను గాయపర్చుకున్న సంఘటన తమిళనాడు చెట్‌పట్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఈరోడ్‌కు చెందిన యువకుడు.. అదే ప్రాంతానికి చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆమె ఓ కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో సదరు యువకుడు.. తనను ప్రేమించాల్సిందిగా యువతిని కోరాడు. కానీ అందుకామె ఒప్పుకోలేదు. ఈ విషయం గురించి ఇంట్లో వారికి కూడా చెప్పింది. దాంతో వారు ఆ యువకుడిని హెచ్చరించి వదిలేశారు. కానీ అతను మాత్రం యువతిని వేధించడం మానలేదు. ఈ క్రమంలో రాత్రి యువతి చెన్నైలోని చెట్‌పట్‌ రైల్వే స్టేషన్‌లో ఉండగా.. సదరు యువకుడు ఆమె దగ్గరకు వెళ్లి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు.

అందుకు యువతి ససేమిరా అనడంతో.. వెంట తెచ్చుకున్న కొడవలితో యువతి మీద దాడి చేసి గాయపర్చాడు. అనంతరం తనను తాను గాయపర్చుకుని రైల్వే ట్రాక్‌ మీద పడి పోయాడు. జరిగిన దారుణం చూసి షాక్‌కు గురయిన జనాలు.. తేరుకుని పోలీసులుకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులిద్దరిని వేర్వేరు ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి బాగానే ఉందని.. కానీ యువతికి మాత్రం గొంతు మీద గాయం కావడంతో మాట్లాడానికి ఇబ్బంది పడుతుందని తెలిపారు. కోలుకున్న తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు