చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ ఆవేదన

4 Feb, 2019 16:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ సోమవారం హైదరాబాద్‌ పోలీసులను కోరారు. తన భర్తను ఇంత దారుణంగా చంపుతారని ఊహించలేదని ఆమె ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మీటింగ్‌ కోసమే తన భర్త అమెరికా నుంచి వచ్చారని తెలిపారు. భర్త బంధువుల వల్లే సమస్యలు వచ్చాయని, తనకు ప్రాణహాని ఉందని 2016లోనే చెప్పారని వెల్లడించారు. సొంత అక్క నుంచే ప్రాణభయం ఉందని జయరాం తనతో చెప్పారని తెలిపారు. శిఖా చౌదరి ప్రమేయం ఎక్కువ కావడంతోనే ఎక్స్‌ప్రెస్‌ చానల్‌ బాధ్యతల నుంచి తొలగించినట్టు చెప్పారు.

కాగా, జయరాంను హైదరాబాద్‌లోనే హత్య చేయడంలో ఈ కేసు దర్యాప్తును తెలంగాణ పోలీసులకు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. విచారణ పూర్తైందని నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామని ఏపీ పోలీసులు వెల్లడించారు. (ఎవరీ రాకేష్‌ రెడ్డి..?)

మరిన్ని వార్తలు