అమ్మా... ఎంత ఘోరం!

15 Nov, 2018 10:47 IST|Sakshi
శ్రీహరిపురంలోని కాలువలో లభించిన మృత శిశువు

శ్రీహరిపురం సమీపంలోని కాలువలో మృత శిశువు లభ్యం

మల్కాపురం(విశాఖ పశ్చిమ): నెలలు కూడా నిండలేదు... కనీసం కళ్లు విప్పి ఈ లోకాన్ని కూడా లేదు... ఇంతలోనే ఆ చిన్నారికి నిండు నూరేళ్లు నిండిపోయాయి... పూర్తిగా రూపం కూడా సంతరించుకోని శిశువును ఓ కఠినాత్మురాలు కర్కసంగా చిదిమేసి కాలువలోకి విసిరేసింది. అమ్మా... మరీ ఇంత ఘోరమా... నేనేం పాపం చేశానని ఈ భూమి మీదకు రానివ్వడం లేదంటూ ఆ శిశువు ఎంతలా విలపించిందో... ఈ హృదయవిదారకర దృశ్యం జీవీఎంసీ 47వ వార్డులో వెలుగుచూసింది. అక్కడి శ్రీహరిపురం, కొత్త రామాలయం వీధిలోని ఓ కాలువలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఓ మృత శిశువును స్థానికులు గుర్తించారు.

ఆ సమయంలో అక్కడ ఆడుకుంటున్న కొంత మంది చిన్నారులు ఆరు నెలల వయసు గల గర్భస్థ శిశువును చూశారు. ముందుగా ఆట బొమ్మ అనుకుని అక్కడ ఉన్న కర్రతో వారు కదిపారు. అనంతరం బొమ్మ కాదని తెలుసుకుని స్థానికులకు తెలియజేశారు. అక్కడి వారంతా కాలువ వద్దకు చేరుకుని మృత శిశువును గట్టుపైకి తీశారు. ఎవరి చేతిలోనో మోసపోయిన అభాగ్యురాలు ఇలా బిడ్డను బరువు అనుకుని కాలువ పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మృత శిశువును స్థానికులే దూరంగా తీసుకెళ్లి పూడ్చేశారు. ఇక్కడకు సమీపంలో సెయింటాన్స్‌ ఆస్పత్రి ఉందని, అక్కడ ఎవరైనా బిడ్డకు జన్మనిచ్చి ఇక్కడి కాలువులో పడేశారా..? లేక స్థానికంగా ఎవరైనా ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారా..? అని స్థానికులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందలేదు.

మరిన్ని వార్తలు