మోసపోయిన బాలికకు కౌన్సెలింగ్‌

29 May, 2018 12:37 IST|Sakshi
బాలికకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న బాలల సంక్షేమ సమతి, చైల్డ్‌లైన్‌ సభ్యులు

తల్లిదండ్రులకు అప్పగించిన చైల్డ్‌లైన్, బాలల సంక్షేమ సమితి సభ్యులు 

విజయనగరం ఫోర్ట్‌ : మోసపోయిన బాలికకు చైల్డ్‌లైన్, బాలల సంక్షేమ సమితి సభ్యులు కౌన్సెలింగ్‌ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే .. ఆగ్రా, ముంబై వంటి పెద్ద పెద్ద పట్టణాలు చూపిస్తానని ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ మోసగాడు అదే రాష్ట్రం బాలంగీర్‌కు చెందిన పదహారేళ్ల బాలికను నమ్మించాడు.

దీంతో బాలిక ఆయనతో పాటు వెళ్లగా మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం విజయనగరం రైల్వేస్టేషన్‌కు చేరుకునే సరికి సదరు వ్యక్తి లేకపోవడంతో బాలిక స్టేషన్‌లో దిగిపోయింది. అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో రైల్వే పోలీసులు గుర్తించి చైల్డ్‌లైన్‌ 1098  సంస్థ సభ్యులకు అప్పగించారు.

బాలిక వద్ద ఉన్న ఫోన్‌ నంబర్‌ అధారంగా తల్లిదండ్రులకు చైల్డ్‌లైన్‌ సభ్యులు సమాచారం అందించారు. బాలిక తల్లిదండ్రులు సోమవారం స్థానిక చైల్డ్‌లైన్‌ కార్యాలయానికి చేరుకోవడంతో బాధితురాలిని బాలల సంక్షేమ కమిటీ ముందు ప్రవేశపెట్టారు.

కౌన్సెలింగ్‌ నిర్వహించిన అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి చైర్మన్‌ వావిలాల లక్ష్మణ్, ప్రసాద్‌రావు, చైల్డ్‌లైన్‌ ప్రతి నిధులు వరలక్ష్మి, మధుసూదనరావు, కృష్ణారావు, సతీష్, రమణమ్మ  పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు