పెళ్లి పీటలపై ఆగిన బాల్యవివాహం

8 May, 2018 10:22 IST|Sakshi
పోలీస్‌ స్టేషన్‌లో నూతనవధూవరులు

బషీరాబాద్‌(తాండూరు) వికారాబాద్‌ : బాల్య వివాహాన్ని పోలీసులు, చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు అడ్డుకున్నారు. ఈ ఘటన బషీరాబాద్‌ మండలం నవల్గ పంచాయతీ పరిధిలోని బోజ్యానాయక్‌ తండాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోజ్యానా యక్‌ తండాకు చెందిన బాలిక (16) అదే పంచాయతీ పరిధిలోని బాబునాయక్‌ తండాకు చెందిన రాథోడ్‌ రమేష్‌ అనే యువకుడితో పెళ్లికి ఏర్పాట్లు చేశారు.

అయితే 1098కు బాల్యవివాహం జరుగుతుందని సమాచారం వెళ్లడంతో వెంటనే చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు వెంకట్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, వెంకటేష్, పోలీసులు బోజ్యానాయక్‌ తండాకు చేరుకున్నారు. బాలికకు పెళ్లి వయసు రాలేదని, పెళ్లిని నిలుపుదల చేశారు. దీంతో ఒక్కసారిగా పెళ్లి పందిరిలో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం వధూవరులను, పెళ్లి పెద్దలను బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

అక్కడి ఉంచి తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకెళ్లిన పోలీసులు వారిని తహీసల్దార్‌ వెంకటయ్య ఎదుట బైండోవర్‌ చేశారు. బాలికకు పెళ్లీడు వచ్చే వరకు పెళ్లి చేయమని తల్లిదండ్రులు ఒప్పంద పత్రం రాసిచ్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ ఇరుకుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు.   

మరిన్ని వార్తలు