నమ్మకంగా నడిపించి.. నట్టేట ముంచి

3 Jun, 2018 12:09 IST|Sakshi
వీరభద్రియ సంఘం సభ్యుల ఇంటి ఎదుట గుమికూడిన డిపాజిట్‌ దారులు

శంకర్‌పల్లి : సంఘం పేరుతో చిట్టీలు, డిపాజిట్‌  చేయించుకొని రాత్రికి రాత్రి ఉడాయించిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధి తులిచ్చిన సమాచారం ప్రకారం... మండల కేంద్రంలో వీరభద్రియ సంఘం చాలా సంవత్సరాలుగా ఉంది. అందులోని సభ్యులు వీరభద్రియ సంఘం పేరు మీద చిట్టీల దందా చేసేవారు. చాలామంది రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు సంఘంలో డబ్బులు డిపాజిట్‌ చేసుకొని నెలనెలా వడ్డీ తీసుకునేవారు. ఎక్కువ వడ్డీ వస్తుండటంతో వీరభద్రియ సంఘంలో కోట్ల రూపాయల డిపాజిట్‌లు చేశారు. అయితే నెలనెలా చిట్టీల డబ్బులను  సంఘం వారు వాడుకోవడంతోపాటు ఇతర కార్యక్రమాలకు ఉపయోగించేవారు. గత రెండేళ్లుగా సంఘంలో డిపాజిట్‌ చేసిన వారి డబ్బులు సరిగా ఇవ్వకపోవడం, చిట్టీ డబ్బులు లేపిన తరువాత సరిగా ఇవ్వకపోవడంతో తమ డబ్బులు ఇచ్చేయాలని డిపాజిట్‌దారులు ఒత్తిడి చేయడం ఎక్కవైంది.

సంఘం సభ్యులు నేడు రేపు నెలా, రెండు నెలలు అంటూ కాలం గడిపారు. ఈ నేపథ్యం లో శుక్రవారం రాత్రి సమయంలో సంఘం సభ్యు లు ఎవరికీ చెప్పకుండా ఇళ్లు ఖాళీ చేసి సంఘానికి తాళం వేసి వెళ్లిపోయారు. ఉదయం సంఘానికి తాళం వేసి ఉండటం చూసిన డిపాజిట్‌ దారులు ఆందోళనకు దిగారు. పైసాపైసా కూడబెట్టి దాచుకున్న డబ్బులతో ఉడాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది సంఘం ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూశారు. అయితే డబ్బులు సంఘంలో డిపాజిట్‌ చేసిన వారు ఒక్కరూ పోలీస్‌స్టేషకు వెళ్లి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అయితే సంఘంలో ఎంత మంది ఎంతెంత డబ్బులు డిపాజిట్‌ చేశారనే వివరాలు పోలీసులకు అందిన ఫిర్యాదులను బట్టే తెలియరానున్నాయి.

మరిన్ని వార్తలు