‘చిట్‌ఫండ్‌’లో రూ.4.5 లక్షల నగదు చోరీ

15 Sep, 2018 10:54 IST|Sakshi
బాధితులతో మాట్లాడుతున్న డీసీపీ వెంకటరెడ్డి, ఫింగర్‌ ప్రింట్స్‌ పరిశీలిస్తున్న దృశ్యం

కాజీపేట: వరంగల్‌ నగరంలోని దర్గాకాజీపేట చౌరస్తాకు కూతవేటు దూరంలో ఉన్న భద్రం చిట్‌ఫండ్‌ కంపెనీలో శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.4.5 లక్షల నగదు అపహరించారు. కంపెనీ ప్రతినిధుల ఫిర్యా దు మేరకు స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దర్గాకాజీపేకు చెందిన 8 మంది మిత్రులు కలిసి భద్రం చిట్‌ఫండ్‌తోపాటు ఎస్‌ఆర్‌ఆర్‌ ఎంటర్‌ ప్రైజేస్‌ ఏర్పాటు చేశారు. గురువారం వినాయక చవితికావడంతో కంపెనీలో పార్ట్‌నర్లు పూజలు చేసి ఎప్పటిలాగే తాళాలు వేసి ఇళ్లకు చేరుకున్నారు.

శుక్రవారం ఉదయం కార్యాలయం శుభ్రం చేయడానికి వచ్చిన స్వీపర్‌ తాళాలు తీసి ఉండడం గమనించి యజమానులకు తెలియజేయగా దొంగతనం జరిగినట్లుగా నిర్థారించారు. కంపెనీ ఎండీ బండి సాంబయ్యతో కలిసి సభ్యులు రూ.4.5లక్షల నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ వెంకటరెడ్డి, సీఐ అజయ్‌ తోపాటు క్రైమ్‌ పోలీసుల బృందం, మడికొండ సీఐ సంతోష్‌ ఘటన స్థలాన్ని సందర్శించారు. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించగా డాగ్‌స్క్వాడ్‌ సిబ్బంది చుట్టుపక్కల గాలించారు. కంపెనీలో చొరబడిన దొంగలు నగదుతోపాటు లోపల ఏర్పా టు చేసిన సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను పట్టుకు వెళ్లారు. పోలీసు జాగాలాలు భవనం వెనుక నుంచి ఫాతిమానగర్‌ ప్రధాన రహదారి సమీపానికి వచ్చి ఆగిపోయాయి.
 
విభిన్న కోణాల్లో విచారణ..
చిట్‌ఫండ్‌లో జరిగిన దొంగతనం కేసు విచారణలో భాగంగా పోలీసులు కార్యాలయంలో పనిచేసే సిబ్బందితోపాటు కంపెనీ డైరెక్టర్‌లు, నిత్యం వచ్చి పోయే వారిని వేర్వేరుగా పిలిపించి విచారణ జరుపుతున్నారు. కార్యాలయంలో ఇంత మొత్తం డబ్బు ఉన్నట్లుగా తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉండొచ్చని.. లేదా ప్రొఫెషనల్‌ దొంగలు ఎవరైనా ఈ పని చేశారా అనే కోణంలో డీసీపీ వెంకటరెడ్డి పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది.

మరిన్ని వార్తలు